రిటైల్ వ్యాపారం ఢమాల్
ABN , First Publish Date - 2020-07-08T06:12:28+05:30 IST
లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ రిటైల్ వ్యాపారం వెలవెలబోతూనే ఉంది. కరోనా దెబ్బ కు వినియోగదారులు ఇంకా కొనుగోళ్లకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. నిత్యావసర వస్తువులు మినహా ఇతర వస్తువుల జోలికి పోవడం లేదు...
- జూన్ ద్వితీయార్ధంలో 67 శాతం డౌన్
న్యూఢిల్లీ: లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ రిటైల్ వ్యాపారం వెలవెలబోతూనే ఉంది. కరోనా దెబ్బ కు వినియోగదారులు ఇంకా కొనుగోళ్లకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. నిత్యావసర వస్తువులు మినహా ఇతర వస్తువుల జోలికి పోవడం లేదు. వాటిని కూడా ఏదో పెద్ద రిటైల్ మాల్కు వెళ్లి కొనే బదులు ఇంటికి దగ్గరలో ఉన్న చిల్లర దుకాణాల్లో కొనేందుకే ఇష్టపడుతున్నారు. దీంతో లాక్డౌన్ ఎత్తివేసినా రిటైల్ మాల్స్తో పాటు ఓ మోస్తరు రిటైల్ దుకాణాలు బోసిపోతూనే న్నాయి.
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది జూన్ 15-30 మధ్య కాలంలో దేశంలోని రిటైల్ వ్యాపారం 67 శాతం మేర పడిపోయిందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) వెల్లడించింది. దేశంలోని 100 చిన్న,పెద్దా రిటైల్ కంపెనీల్లోని వ్యాపారాలను పరిశీలించి ఆర్ఏఐ ఒక నివేదికను విడుదల చేసింది. గత నెల 15-30 తేదీల్లో మాల్స్లో వ్యాపారం ఏకంగా 77 శాతం పడిపోగా హై స్ట్రీట్ రిటైల్ వ్యాపారం 62 శాతం మేర క్షీణించిందని ఆర్ఏఐ వెల్లడించింది.
ఉత్తరాదిలో ఎక్కువ
దేశ దక్షిణ, తూర్పు ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో రిటైల్ వ్యాపారంలో నష్టం మరింత ఎక్కువగా ఉంది. దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని రిటైల్ మాల్స్లో జూన్ నెలలో వ్యాపారం 62 శాతం పడిపోయింది. ఇదే సమయంలో పశ్చిమ ప్రాంతంలో 74 శాతం, ఉత్తర ప్రాంతంలో 71 శాతం వ్యాపా రం దెబ్బతింది. గత ఏడాది ఏప్రిల్-జూన్ కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఇదే కా లంలో రిటైల్ మాల్స్ వ్యాపారం 74 శాతం తగ్గిందని ఆర్ఏఐ సీఈఓ కుమార్ రాజగోపాలన్ చెప్పారు. ఇది ఆర్థిక వ్యవస్థ కష్టాలకూ అద్గం పడుతోందన్నారు.