నీట్ వాయిదా కుదరదు
ABN , First Publish Date - 2021-09-07T06:45:31+05:30 IST
నీట్ పరీక్షను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షను వాయిదా వేస్తే
- విద్యార్థుల శ్రమంతా వృథా అవుతుంది
- ఏ రోజు పెట్టినా ఇతర పరీక్షలు ఉంటాయి
- కొద్దిమంది కోసం మొత్తం పరీక్షను ఆపలేం
- స్పష్టం చేసిన సుప్రీం ధర్మాసనం
నీట్ పరీక్షను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షను వాయిదా వేస్తే ఎప్పటి నుంచో సన్నద్ధమవుతున్న లక్షలాది మంది విద్యార్థుల శ్రమంతా వృధా అవుతుందని పేర్కొంది. నీట్ నిర్వహించే రోజు వేరే పరీక్షలు కూడా ఉన్నవారు దేనికి హాజరుకావాలో తామే నిర్ణయించుకోవాలని స్పష్టం చేసింది. ఈ నెల 12న దేశవ్యాప్తంగా నీట్- యూజీ పరీక్షను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. అయితే అదే సమయంలో 12వ తరగతి విద్యార్థులకు కంపార్ట్మెంట్ పరీక్షలు ఉన్నందున నీట్ను వాయిదా వేయాలని కోరుతూ కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు పాతికవేల మంది విద్యార్థులు కంపార్ట్మెంట్ పరీక్షలు రాస్తున్నట్టు పిటిషన్లో పేర్కొన్నారు.
సోమవారం దీన్ని విచారించిన జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం... ఒకే సమయంలో వివిధ పరీక్షలు ఉన్నప్పుడు ప్రాధాన్యాన్ని బట్టి ఏ పరీక్ష రాయాలో విద్యార్థులు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఒక శాతం విద్యార్థుల కోసం జాతీయ స్థాయిలో లక్షల మంది హాజరయ్యే నీట్ పరీక్షను ఆపలేమని తెలిపింది.