నేమ్ చేంజర్స్ కావాలా? గేమ్ చేంజర్స్ కావాలా?
ABN , First Publish Date - 2020-11-28T08:04:46+05:30 IST
‘రాజకీయాల్లో గెలుస్తాం. ఓడిపోతాం. అధికారంలో ఉంటాం. ప్రతిపక్షంలో ఉంటాం. కానీ ఈ నగరం, రాష్ట్రం శాశ్వతం.
‘భాగ్యనగరం’గా మారిస్తే బంగారమైతదా?
రియల్ ఎస్టేట్ సమ్మిట్-2020లో మంత్రి కేటీఆర్
హైదరాబాద్ సిటీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘రాజకీయాల్లో గెలుస్తాం. ఓడిపోతాం. అధికారంలో ఉంటాం. ప్రతిపక్షంలో ఉంటాం. కానీ ఈ నగరం, రాష్ట్రం శాశ్వతం. తాత్కాలికంగా నాలుగు ఓట్ల కోసం రెచ్చగొట్టి నిప్పుపెడితే.. దాన్ని ఎవరు ఆర్పాలి. 2020లో అడ్డమైన మాటలు చెల్లవు. హైదరాబాద్ పేరు మార్చితే ఏమి వస్తుంది? భాగ్యనగరం పేరు పెడితే తెల్లారి బంగారమవుతుందా? ఆలోచించండి. నేమ్ చేంజర్స్ కావాలా? గేమ్ చేంజర్స్ కావాలా? డిసైడెడ్ పాలిటిక్స్ కావాలా? డివైడెడ్ పాలిటిక్స్ కావాలా? ఎన్నికల్లో ప్రజా సమస్యలను టార్గెట్ చేసి ఓట్లడగాలి.
కానీ ఒక వర్గాన్ని టార్గెట్ చేసి గుడ్డిగా చేసే రాజకీయాలను తిప్పి కొట్టాలి’ అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో క్రెడాయ్, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన రియల్ ఎస్టేట్ సమ్మిట్-2020లో ఆయన మాట్లాడారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో తాత్కాలికంగా అసౌకర్యం కలుగుతున్నప్పటికీ, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణతో రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.
బిల్డర్లు, డెవలపర్ల ఇబ్బందులు గట్టేక్కేందుకు తాత్కాలికంగా పాత పద్ధతిలో రిజిస్ర్టేషన్లు చేసే విషయమై సీఎం కేసీఆర్ను ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఇంచు భూమిని సర్వే చేసి డిజటలైజేషన్ చేస్తామని, ప్రజలపై భారం పడకుండా ఆస్తులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు.