చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి: ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2021-02-24T01:25:33+05:30 IST

ప్రతిపక్ష నాయకురాలిగా నిరంతరం ప్రజావాణిని ఈశ్వరీబాయి వినిపించారన్న ఉపరాష్ట్రపతి, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు, వ్యవసాయ కూలీలు, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనుల సమస్యలపై పోరాటం చేశారన్నారు

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి: ఉపరాష్ట్రపతి

హైదరాబాద్: చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని, వారి ప్రాధాన్యతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ దిశగా అన్ని రాజకీయ పార్టీలు సమన్వయంతో చర్చించుకుని మహిళలకు రిజర్వేషన్లపై ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు. మాజీ ఎమ్మెల్యే, సామాజికవేత్త దివంగత ఈశ్వరీబాయి స్మారక స్టాంపును మంగళవారం హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్టాంప్ విడుదల లక్ష్యం ఆమె స్ఫూర్తిని ముందు తరాలకు పంచడమేనని అన్నారు.


ప్రతిపక్ష నాయకురాలిగా నిరంతరం ప్రజావాణిని ఈశ్వరీబాయి వినిపించారన్న ఉపరాష్ట్రపతి, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు, వ్యవసాయ కూలీలు, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనుల సమస్యలపై పోరాటం చేశారన్నారు. పార్లమెంటు సహా రాష్ట్రాల శాసనసభల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకతను ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత 17వ లోక్‌సభలో గతంలో ఎన్నడూ లేని విధంగా 78 మంది మహిళా పార్లమెంటు సభ్యులున్నప్పటికీ, మొత్తం ఎంపీల సంఖ్యలో ఇది కేవలం 14 శాతమేనని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా లక్షల మంది మహిళలకు సాధికారత కలుగుతోందని వెంకయ్య పేర్కొన్నారు.


చట్టసభల్లో అర్థవంతమైన చర్చలకు బదులుగా అంతరాయాలు, ఆందోళనకర ఘటనలు చోటుచేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి.. పార్లమెంటేరియన్లు, ఇతర ప్రజాప్రతినిధులు చర్చల విషయంలో ప్రమాణాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. అర్థవంతమైన చర్చలే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సరికొత్త శక్తినిస్తాయన్న ఆయన సభాకార్యక్రమాలకు తరచుగా అంతరాయం కలిగించడం ద్వారా సాధించేది ఏదీ లేదని తెలిపారు. తరచుగా చట్టసభల్లో నెలకొంటున్న కొన్ని ప్రతికూల ఘటనలు, అంతరాయాలు ప్రజాతీర్పును అగౌరవపరచడమే అవుతుందన్నారు. ‘ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడంలో తప్పులేదు. కానీ ప్రజాతీర్పును మాత్రం గౌరవించాల్సిందే’ అని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు.

Updated Date - 2021-02-24T01:25:33+05:30 IST