భారత్ బంద్ ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా 595 రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2022-06-21T02:48:15+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నేడు జరిగిన భారత్ బంద్ కారణంగా దేశవ్యాప్తంగా

భారత్ బంద్ ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా 595 రైళ్ల రద్దు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నేటి భారత్ బంద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 595 రైళ్లు రద్దయ్యాయి. ఇందులో 208 మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లు, 379 పాసింజర్ రైళ్లు ఉన్నాయి. అలాగే, నాలుగు మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లు, ఆరు ప్యాసింజర్ రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. అగ్నిపథ్ ఆందోళనల ప్రభావం ఎక్కువగా రైళ్లపైనే పడింది. ఆందోళనకారులు రైల్వే స్టేషన్లను, రైళ్లను లక్ష్యంగా చేసుకోవడంతో పలు రాష్ట్రాల్లో రైల్వే ఆస్తులకు తీరని నష్టం వాటిల్లింది. ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి వందలాదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, భారత్ బంద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. 


యూత్ కాంగ్రెస్ సభ్యులు ఢిల్లీలోని శివాజీ బ్రిడ్జి వద్ద ఓ రైలును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు రైలుపైకెక్కి అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. మరోవైపు, ఆందోళనల నేపథ్యంలో దేశంలోని దాదాపు అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భారీ భద్రతా చర్యలు చేపట్టారు. పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. బంద్ నేపథ్యంలో ఝార్ఖండ్ ప్రభుత్వం విద్యా సంస్థలను మూసివేసింది. హర్యానాలో కోచింగ్ సెంటర్లను మూసివేశారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లోనూ పోలీసు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  

Updated Date - 2022-06-21T02:48:15+05:30 IST