ఒకే ఫ్యాక్టరీలోని 300 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్.. యూకేలో..

ABN , First Publish Date - 2020-08-15T06:22:48+05:30 IST

యూకేలోని శాండ్‌విచ్ ఫ్యాక్టరీలో పనిచేసే 299 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది.

ఒకే ఫ్యాక్టరీలోని 300 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్.. యూకేలో..

లండన్: యూకేలోని శాండ్‌విచ్ ఫ్యాక్టరీలో పనిచేసే 299 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఒకే ఫ్యాక్టరీలో ఇంతమందికి పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ ఫ్యాక్టరీ నార్తాంప్టన్ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో అధికారులు శాండ్‌విచ్ ఫ్యాక్టరీలోని ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేయడం ప్రారంభించారు. 299 మందికి పాజిటివ్ అని తేలగా.. ఇంకా చాలా మంది ఉద్యోగుల పరీక్ష ఫలితాలు రావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. తమ కంపెనీలోని వందలాది మంది ఉద్యోగులకు కరోనా రావడంతో వారిని వెంటనే సెల్ఫ్ ఐసోలేషన్‌కు పంపామని సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, అధికారులు ఎప్పటికప్పుడు తమకు సహాయ సహకారాలు అందిస్తున్నారంటూ ప్రకటనలో సంస్థ యాజమాన్యం చెప్పుకొచ్చింది. నార్తాంప్టన్ ప్రాంతంలో గత నాలుగు వారాల నుంచి కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. కాగా.. యూకేలో ఇప్పటివరకు 313,798 కేసులు నమోదుకాగా.. కరోనా కారణంగా  41,358 మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-08-15T06:22:48+05:30 IST