బీహార్లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం: నిత్యానంద్ రాయ్
ABN , First Publish Date - 2020-10-31T00:18:03+05:30 IST
నరేంద్ర మోదీ పేరు, ఆయన చేసిన అభివృద్ధి పనులకు బీహార్ ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోందని..
పాట్నా: బీహార్లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రజలందరికీ చేరాయని అన్నారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీయే గాలులు బలంగా వీస్తున్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ పేరు, ఆయన చేసిన అభివృద్ధి పనులకు బీహార్ ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మూడింట రెండు వంతుల మెజారిటీ సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీహార్లో ఈనెల 28న జరిగిన తొలి విడత పోలింగ్లో 55.69 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2015 కంటే పోలింగ్ శాతం పెరిగింది. మరో రెండు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.