ద్రౌపది ముర్ము పూర్వీకుల గ్రామానికి తొలిసారి కరెంట్...

ABN , First Publish Date - 2022-06-26T23:23:16+05:30 IST

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పూర్వీకుల గ్రామానికి తొలిసారిగా విద్యుత్..

ద్రౌపది ముర్ము పూర్వీకుల గ్రామానికి తొలిసారి కరెంట్...

భువనేశ్వర్: ఎన్డీయే (NDA) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము (Droupadi murmu) పూర్వీకుల గ్రామానికి తొలిసారిగా విద్యుత్ రాబోతోంది. ఏళ్ల తరబడి చిమ్మచీకట్లలో మగ్గుతున్న మయూర్‌భంజ్ జిల్లా ఉపరెబేడ గ్రామంలో ఎలక్ర్టిఫికేషన్ (Elctrification) పనులను ఒడిశా ప్రభుత్వం చేపట్టింది. ద్రౌపది ముర్ము ప్రస్తుతం ఈ గ్రామంలో ఉండటం లేదు. కౌసుమి బ్లాక్‌లోని ఉపర్‌బేడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని మున్సిపల్ టౌన్ రాయ్‌రంగపూర్‌కు దశాబ్దాల క్రితమే ఆమె వెళ్లిపోయారు.


ఉపర్‌బేడలో 3,500 మంది జనాభా ఉన్నారు. ఇందులో బడాసాహి, దున్‌గుర్‌సాహి అనే రెండు కుగ్రామాలు  (Hamlets) ఉన్నాయి. బడాసాహిలో పూర్తి విద్యుద్దీకరణ జరిగింది. దున్‌గుర్‌సాహిలో కేవలం 14 ఇళ్లు ఉన్నాయి. వీటికి ఇప్పటికీ కరెంట్ సౌకర్యం లేదు. దున్‌గుర్‌సాహిలో 20 కుటుంబాలు నివసిస్తుండగా వారంతా కిరోసిన్ దీపాలపైనే ఆధారపడుతున్నారు. మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కిలోమీటర్ దూరంలోని మరో గ్రామానికి వెళ్లాల్సిందే.


ద్రౌపది ముర్ము మేనల్లుడు బిరాంచి నారాయణ్ తుడు ఇదే గ్రామంలో (Dungursahi) తన భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించమని ఎందరికో తాము విజ్ఞప్తులు చేశామని, అయితే ఎవరూ తమ అభ్యర్థనను పట్టింకుకోలేదని బిరాంచి భార్య మీడియాకు తెలిపారు. పండుగల్లో తమ గ్రామానికి ద్రౌపది ముర్ము వచ్చినప్పుడు మాత్రం ఈ విషయాన్ని ఆమె దృష్టికి తేలేదని చెప్పారు.


ఎట్టకేలకు స్థానికుల ఆగ్రహాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. గిరిజన ప్రాబల్యం కలిగిన ఆ గ్రామంలో యుద్ధ ప్రాతిపదికన విద్యుద్దీకరణ పనులు ప్రారంభించింది. విద్యుత్ స్తంభాలు, ట్రాన్‌ఫార్మర్లు అమర్చే పనులు జరుగుతున్నాయి. టాటా పవర్ నార్త్ ఒడిస్సా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీఎన్‌ఓడీఎల్) అధికారులు, సిబ్బంది ఈ పనుల్లో మునిగిపోయారు. అటవీ భూముల్లో ఇళ్లు ఉండటం వల్లనే ఇంతవరకూ దున్‌గుర్‌సాహిలో విద్యుద్దీకరణ పనులు చేపట్టలేదని విద్యుత్ శాఖ అధికారి దీనిపై వివరణ ఇచ్చారు. గ్రామస్థులను చీకట్లలో మగ్గేలా చేయడం తమ ఉద్దేశం కాదని, అధికారిక ఆమోదం లేనందునే తాము ముందుకు వెళ్లలేకపోయాయమని పేరు చెప్పేందుకు నిరాకరించిన ఆ అధికారి వివరించారు. దీనిపై ఆ గ్రామ పంచాయతీ సమితి సభ్యుడు ధన్‌మణి మాట్లాడుతూ, రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును బీజేపీ ప్రకటించక ముందే తాము ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కోసం జిల్లా కలెక్టర్ వినీత్ భరద్వాజ్‌కు దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే గ్రామస్థులందరికీ విద్యుత్ కనెక్షన్లు వస్తాయని అనుకుంటున్నామని తెలిపారు.

Updated Date - 2022-06-26T23:23:16+05:30 IST