బీజేపీలోకి ఎన్సీపీ ఎమ్మెల్యేలు? పార్టీ రియాక్షన్ ఇదీ!
ABN , First Publish Date - 2020-08-10T21:43:45+05:30 IST
ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అంతే కాకుండా 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ కండువా కప్పుకున్న కొంతమంది ఎన్సీపీలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు..
ముంబై: తమ పార్టీ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని వార్తలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ ఖండించారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, కొంత మంది కావాలనే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అంతే కాకుండా 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ కండువా కప్పుకున్న కొంతమంది ఎన్సీపీలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు.
‘‘మా పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారనేది అవాస్తవం. కొంత మంది కావాలనే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలోకి వెళ్లిన కొంత మంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎన్సీపీలోకి రావాలని ఆతృతగా ఉన్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక వేళ ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటే బహిరంగంగా ప్రకటిస్తాం’’ అని నవాబ్ మాలిక్ అన్నారు.