విచారణకు హాజరు కండి
ABN , First Publish Date - 2020-09-24T07:18:32+05:30 IST
బాలీవుడ్ తారలు దీపికా పదుకొనే,సారా అలీఖాన్, రకుల్ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్లకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు బుధవారం సమన్లు జారీ చేశారు.
దీపిక, శ్రద్ధా, రకుల్, సారాలకు ఎన్సీబీ సమన్లు
నేటి నుంచి మూడు రోజులపాటు విచారణ
ఎన్సీబీ ఎదుట హాజరైన నిర్మాత మధు మంతెన
హిందీ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు దర్యాప్తులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. బాలీవుడ్ తారలు దీపికా పదుకోన్, సారా అలీఖాన్, రకుల్ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్కు బుధవారం సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా వారిని ఆదేశించారు.
ముంబయి, సెప్టెంబరు 23: బాలీవుడ్ తారలు దీపికా పదుకొనే,సారా అలీఖాన్, రకుల్ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్లకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు బుధవారం సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీపిక మేనేజర్ కరిష్మాప్రకాశ్, ఆత్మహత్యకు పాల్ప డ్డ నటుడు సుశాంత్సింగ్ మేనేజర్ శ్రుతి మోదీ, డిజైనర్ సిమోన్ ఖంబట్టాను కూడా విచారణకు పిలిచారు. రకుల్ప్రీత్, శ్రుతి మోదీ, సిమోన్లను గురువారం (ఈ నెల 24న), దీపికా పదుకొనేను 25న, సారా, శ్రద్ధాలను 26న విచారించనున్నట్లు పేర్కొన్నారు. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి వెల్లడించిన వివరాల మేరకు టాలెంట్ సంస్థ మేనేజర్ జయా సాహాను విచారించగా పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తున్నా యి. సినీ నిర్మాత మధు మంతెన వాంగ్మూలాన్ని బుధవారం ఎన్సీబీ అధికారులు రికార్డు చేశారు.
అనురాగ్ కశ్య్పపై రేప్ కేసు
బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్య్పపై అత్యాచారం కేసు నమోదైంది. 2013లో అనురాగ్ తనను అత్యాచారం చేశాడంటూ నటి పాయల్ ఘోష్ ముంబైలోని వెర్సోవా పోలీ్సస్టేషన్లో చేసి న ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఏడేళ్ల క్రితం వెర్సోవాలోని యారీ రోడ్లోని కశ్యప్ కార్యాలయంలో తనను రేప్ చేశాడని పాయల్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి తన న్యాయవాది నితిన్ సాత్పుతేతో కలిసి వెళ్లి ఫిర్యాదు చేశారు. అనురాగ్పై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 376 (1), 354, 341, 342 ప్రకార కేసు నమోదు చేశారు.