ఆర్యన్ కేసులో దర్యాప్తు అధికారి సంచలన అభియోగం

ABN , First Publish Date - 2021-10-12T17:02:56+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌సీబీకి చెందిన ఉన్నతాధికారిపై..

ఆర్యన్ కేసులో దర్యాప్తు అధికారి సంచలన అభియోగం

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌సీబీకి చెందిన ఉన్నతాధికారిపై గూఢచర్యం జరుగుతోందా? ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. ఈ నెల ప్రారంభంలో ముంబై తీరంలో క్రూయిజ్ నౌకపై జరిపిన దాడులకు సమీర్ వాంఖడే సారథ్యం వహించారు. ఈ దాడుల్లోనే ఆర్యన్ ఖాన్ పట్టుబడ్డాడు. ఆ క్రమంలోనే తమ కదలికపై కొందరు వ్యక్తులు నిఘా వేసినట్టు వాంఖడే గమనించారు. ఈ విషయాన్ని వాంఘెడే, సీనియర్ అధికారి ముథా జైన్‌ మహారాష్ట్ర పోలీస్ చీఫ్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్టు ఎన్‌సీబీ వర్గాలు చెప్పాయి. వాంఘెడే తరచు తన తల్లిని పూడ్చిపెట్టిన స్మశాన వాటికకు వెళ్లివస్తుంటారు. ఆ సమయంలో పోలీసు ఆఫీసర్లమని చెప్పుకుంటున్న ఇద్దరు వ్యక్తులు తనపై నిఘా వేసినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా గమనించామని కూడా వాంఘెడే ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. కాగా, తనపై గూఢచర్యం వ్యవహారంపై మీడియా ముందు కామెంట్ చేసేందుకు వాంఘెడే నిరాకరించారు. ఇది చాలా సీరియస్ వ్యవహారమని ముక్తసరిగా చెప్పారు.


ఆర్యన్ ఖాన్, అతని మిత్రుడు అర్బాజ్ మర్చెంట్, మరో ఆరుగురిని గత వారంలో అరెస్టు చేశారు. ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ను ఏజెన్సీ పట్టుకోనప్పటికీ, అతని వాట్సాప్ సంభాషణలు నేరాన్ని నిరూపించేలా ఉన్నాయని ఎన్‌సీబీ చెబుతోంది. ఆర్యన్ ఖాన్ అరెస్టు వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుటోంది. ఈ కేసును ఏజెన్సీ నడుపుతున్న తీరుపై మహారాష్ట్ర అధికార కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. రెయిడ్స్ జరిగినప్పటి విజువల్స్‌లో బీజేపీ సీియర్ నేత మనీష్ భనుషాలి కనిపిస్తున్నారని, నకిలీ డ్రగ్స్ కేసుతో మహారాష్ట్రపై బురద చల్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనడానికి ఇదే ఉదాహరణ అని ఎన్‌సీపీ  నేత నవాబ్ మాలిక్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను భనుషాలి, ఏజెన్సీ వర్గాలు ఖండించాయి. 


Updated Date - 2021-10-12T17:02:56+05:30 IST