మార్పు తెచ్చేది జ్ఞానమే

ABN , First Publish Date - 2022-07-22T08:10:01+05:30 IST

పూర్వకాలంలో ఉన్నతవర్గాల వారికీ, సంపద కలిగిన వారికీ మాత్రమే జ్ఞానార్జన చేసే అవకాశం ఉండేది. మహిళలకు విద్య నేర్చుకొనే అవకాశం దాదాపుగా లేదు. అయితే విద్యా-జ్ఞానాలకు ఇస్లాం...

మార్పు తెచ్చేది జ్ఞానమే

పూర్వకాలంలో ఉన్నతవర్గాల వారికీ, సంపద కలిగిన వారికీ మాత్రమే జ్ఞానార్జన చేసే అవకాశం ఉండేది. మహిళలకు విద్య నేర్చుకొనే అవకాశం దాదాపుగా లేదు. అయితే విద్యా-జ్ఞానాలకు ఇస్లాం ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చింది. విశ్వాసానికి మూలాధారం జ్ఞానమేనని పేర్కొంది. అంటే... మనిషి విశ్వాసం పటిష్టం కావాలంటే... వీలైనంత ఎక్కువ జ్ఞానం పొందాలి. మంచి గురువుల ద్వారా దాన్ని ఆర్జించాలి. అలా ఆర్జించిన జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి. దాని ద్వారా సమాజంలో మంచి మార్పు కలుగుతుంది. జ్ఞానవంతుడైన వ్యక్తిలో క్రమశిక్షణ, పద్ధతిగా మాట్లాడడం, పెద్దల పట్ల గౌరవం, పిల్లలపై ప్రేమ, ఇరుగు పొరుగువారితో సామరస్యం, స్నేహితులు, బంధువులతో మంచి సంబంధాలు లాంటివి కనిపిస్తాయి. ఇవన్నీ ఉన్నవారే మహోన్నతమైన వ్యక్తులవుతారు. ఆదర్శ పౌరులవుతారు. వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. సమాజం వారిని అనుసరిస్తుంది. జ్ఞానం మానవుడి ప్రగతికి, వికాసానికి రాచబాట వేస్తుంది. అత్యున్నత నాగరికతకూ, సంస్కృతికీ పునాదులు వేస్తుంది. 


అజ్ఞానం మనిషిని అంధకారంలో బంధిస్తుంది. అనాగరికుణ్ణి చేస్తుంది. అజ్ఞానం వల్ల మనిషి కొన్ని చోట్ల తడబడతాడు, భయపడతాడు, వెనుకపడిపోతాడు. పదిమందిలో మాట్లాడ్డానికి జంకుతాడు. సిగ్గుతో తలవంచాల్సిన పరిస్థితి తెచ్చుకుంటాడు. ఇవన్నీ ఊహించుకొని... వెనకడుగు వేయడానికి ప్రయత్నిస్తాడు. ఇతరుల మీద భారం వేసి తప్పుకుంటాడు. ఎవరైనా ప్రశ్నిస్తే... ‘‘నా దగ్గర అంత జ్ఞానం లేదు’’ అని సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు.

‘‘లోకంలో సమస్తాన్నీ సృష్టించిన నీ ప్రభువు... పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మనిషిని సృష్టించాడు. నీ ప్రభువు దయామయుడు. ఆయన కలం ద్వారా విద్య నేర్పాడు. మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు... ’’ ఇవి దివ్య ఖుర్‌ఆన్‌ అవతరణలోని మొదటి వాక్యాలు. అల్లాహ్‌ ప్రకటించిన ఈ వాక్యాలు విద్య అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనాగరికులైన మానవులు నాగరికులుగా మారడానికి విద్య అవసరమని సూచిస్తున్నాయి. ఆటవిక సమాజం... ఆధునిక సమాజంగా మారడానికి విద్య అంటే జ్ఞానం ఆవశ్యకమని చెబుతున్నాయి. ‘‘మీరు జ్ఞానాన్ని ఆర్జించే ప్రయత్నం చెయ్యండి.... అది సుదూరమైన దేశంలో లభించినా సరే’’ అని అంతిమ దైవప్రవక్త మహమ్మద్‌ బోధించారు. కాబట్టి విద్య, జ్ఞానాల పరమార్థం గుర్తించే అవగాహనను ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి. 

Updated Date - 2022-07-22T08:10:01+05:30 IST