ప్రయాణికులకు శుభవార్త: రైలులోకే నవరాత్రి ఫలహారాలు... పూర్తి వివరాలివే!
ABN , First Publish Date - 2022-09-26T17:40:47+05:30 IST
దేశంలో ఘనంగా దసరా నవరాత్రులు మొదలయ్యాయి.
దేశంలో ఘనంగా దసరా నవరాత్రులు మొదలయ్యాయి. ఈ సమయంలో చాలామంది ఉపవాసాలు పాటిస్తారు. మరికొందరు సాత్విక ఆహారాన్నే తీసుకుంటారు. దీనిని గుర్తించిన రైల్వేశాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఐఆర్సీటీసీ నవరాత్రుల సమయంలో ప్రయాణికులకు సాత్విక ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు నవరాత్రి ప్రత్యేక థాలిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం రైలు ప్రయాణికులు 1323కి డయల్ చేసి, ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న ఈ క్యాటరింగ్కు మీకు ఇష్టమైన నవరాత్రి స్పెషల్ ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు.
దీంతో రైలులోని మీ సీటు వద్దకే మీరు కోరుకున్న ఆహారం లభిస్తుంది. అహ్మదాబాద్, అమృత్సర్, భోపాల్, వడోదర, బిలాస్పూర్, కోయంబత్తూర్, ముంబై, గ్వాలియర్, హైదరాబాద్, జబల్పూర్, జైపూర్, కళ్యాణ్, చెన్నై సెంట్రల్, ముంబై సెంట్రల్, చెన్నై ఎగ్మోర్ సహా దేశవ్యాప్తంగా 78 రైల్వే స్టేషన్లలో ఐఆర్సీటీసీ నవరాత్రి స్పెషల్ థాలీని అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఈ స్టేషన్లలో ఉన్న ఐఆర్సీటీసీ రెస్టారెంట్లలో కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ స్పెషల్ థాలీలో వెల్లుల్లి వినియోగించరని ఐఆర్సీటీసీ తెలిపింది.