ఒకే వేదిక పంచుకున్న సీఎం అమరీందర్, సిద్ధూ

ABN , First Publish Date - 2021-07-23T20:21:06+05:30 IST

పంజాబ్ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారంనాడు రాష్ట్ర కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా..

ఒకే వేదిక పంచుకున్న సీఎం అమరీందర్, సిద్ధూ

ఛండీగఢ్: పంజాబ్ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారంనాడు రాష్ట్ర కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల పాటు సీఎం అమరీందర్‌తో కొనసాగిన విభేదాలకు తెరదించుతూ ఉభయనేతలు ఒకే వేదికను పంచుకున్నారు. తొలుత సిద్ధూ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి సీఎం హాజరుకాకపోవచ్చంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే, అమరీందర్ తన విధేయులైన ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమంలో హాజరయ్యారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నేతలంతా ఒకే వేదికపైకి రావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం తొంగిచూసింది.


ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ,  కాంగ్రెస్ అనే మహాసముద్రంలో సిద్ధూ ఒక చిన్న కార్యకర్త అని, పార్టీకి కార్యకర్తలే గుండెకాయ అని అన్నారు. కార్యకర్తలతో తాను మమేకమవడం అంటే పంజాబ్ ఆత్మతో మమేకం కావడమేనని అన్నారు. అమరీందర్ సింగ్ సమక్షంలో సిద్ధూకు సన్మానం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి హరీష్ రావత్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-23T20:21:06+05:30 IST