Breaking: పంజాబ్ మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష

ABN , First Publish Date - 2022-05-19T20:07:07+05:30 IST

పంజాబ్ మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. 30 ఏళ్ల క్రితం నాటి కేసులో..

Breaking: పంజాబ్ మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష

న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. 30 ఏళ్ల క్రితం నాటి కేసులో సిద్ధూకు అత్యున్నత న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. 1988, డిసెంబర్ 27న రోడ్డుపై సిద్ధూకు, గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడిని సిద్ధూ క్షణికావేశంలో తలపై కొట్టడంతో ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పును గురువారం వెల్లడించింది.


ఈ కేసు పూర్వాపరాలివి..

1988, డిసెంబర్ 27న రోడ్డుపై సిద్ధూకు, గుర్నామ్ సింగ్ అనే 65 ఏళ్ల వృద్ధుడికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడిని సిద్ధూ క్షణికావేశంలో తలపై కొట్టడంతో ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. పాటియాలాలోని ట్రాఫిక్ జంక్షన్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఆ వృద్ధుడిని వాహనంలో నుంచి బయటకు లాగి మరీ సిద్ధూ పిడిగుద్దులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన గుర్నామ్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు సెప్టెంబర్, 1999లో నవజోత్ సింగ్ సిద్ధూను, అతని స్నేహితుడు సంధూను నిర్దోషులుగా తేల్చుతూ తీర్పిచ్చింది. బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించడంతో ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు పక్కకు పెట్టింది.


హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నవజోత్, అతని స్నేహితుడు సుప్రీం కోర్టుకు వెళ్లారు. 2007లో ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించిన సుప్రీం సిద్ధూకు సెక్షన్ 323 కింద వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది. ఈ కేసులో సిద్ధూకు కేవలం వెయ్యి రూపాయల జరిమానా మాత్రమే విధిస్తూ తీర్పు రావడంపై బాధిత కుటుంబం అభ్యంతరం తెలుపుతూ సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రివ్యూ పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం వెయ్యి రూపాయల జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తూ 34 ఏళ్ల నాటి కేసులో సుప్రీం తీర్పును వెలువరించింది. గుర్నామ్ సింగ్ బంధువు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను జస్టిస్ ఏఎమ్ ఖాన్విల్కర్, ఎస్‌కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు అనుమతించింది. తాజాగా ఈ తీర్పును వెలువరించింది.

Updated Date - 2022-05-19T20:07:07+05:30 IST