కంపెనీ డబ్బులు కొట్టేసి.. కోల్కతా, భువనేశ్వర్లో జల్సాలు
ABN , First Publish Date - 2021-04-09T18:30:46+05:30 IST
అన్నంపెట్టిన సంస్థకే కన్నం వేసి ...
హైదరాబాద్ : అన్నంపెట్టిన సంస్థకే కన్నం వేసి రూ. 50.57లక్షలతో ఉడాయించి ఆన్లైన్ రమ్మి, క్యాసినో గేమ్స్ ఆడుతున్న కేటుగాడి ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన నీలపు నవీన్రెడ్డి 2017లో బ్యాంకింగ్ సర్వీ్సలో పీజీ డిప్లోమా పూర్తి చేశాడు. హైదరాబాద్లోని యాక్సిస్ బ్యాంకులో ఓ బ్రాంచ్లో అసిస్టెంట్ మేనేజర్గా చేరాడు. ఆన్లైన్ రమ్మీ, క్యాసినో గేమ్స్ ఆడుతూ, వ్యసనపరుడిలా మారాడు. ఈ ఆటల్లో రూ. లక్షలు పోగొట్టుకున్నాడు. దాంతో చెడువ్యసనాలకు బానిసయ్యాడు. ఉద్యోగం కూడా పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి.
అనంతరం పెద్ద అంబర్పేటలో ఉన్న జేబీ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా చేరాడు. మంచి వాడిగా ప్రవర్తించి యాజమాన్యం నమ్మకాన్ని చూరగొన్నాడు. గతనెల 23న కంపెనీ డబ్బులు రూ. 50,57,690లు జమ అయ్యాయి. బ్యాంకులో వేయడానికి సయయం లేకపోవడంతో నవీన్రెడ్డికి ఇచ్చి, భద్రపరచాల్సిందిగా కంపెనీ యాజమాన్యం చెప్పింది. దాంతో నవీన్ ఆ డబ్బులు తీసుకెళ్లాడు. ఆ మరుసటి రోజు నుంచి ఫోన్ రిసీవ్ చేయ లేదు.
కోల్కతా, భువనేశ్వర్లో జల్సాలు..
కొట్టేసిన డబ్బుతో తన బంధువైన పలాసకు చెందిన అమిత్రెడ్డితో కలిసి ఆన్లైన్ రమ్మి, క్యాసినో గేమ్స్ ఆడాడు. రూ. లక్షల్లో పోగొట్టుకున్నాడు. అమిత్రెడ్డి స్నేహితుడు బచ్చు రామకృష్ణ వద్ద రూ. 5 లక్షలు దాచిపెట్టి ఇద్దరు కలిసి కోల్కతా, అక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్లారు. అక్కడ కూడా ఎంజాయ్ చేసి, ఆన్లైన్ గేమ్స్ ఆడారు. కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ రాహుల్ హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీ మహేష్ భగవత్ ఆదేశాలతో.. ఇన్స్పెక్టర్ సురేందర్ తన బృందంతో రంగంలోకి దిగారు. టెక్నికల్ ఎవిడెన్స్ను సేకరించి నిందితుని ఆచూకీ కనిపెట్టారు. గురువారం ప్రధాన నిందితుడితో సహా మొత్తం ముగ్గురిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి నుంచి రూ. 28,69,800ల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి పర్యవేక్షణలో చాకచక్యంగా నిందితుడి ఆటకట్టించిన హయత్నగర్ పోలీసులను సీపీ మహేష్ భగవత్ అభినందించి రివార్డులు అందజేశారు.