మామిడిపళ్లు చెట్టుకే పండాయా?

ABN , First Publish Date - 2021-05-05T05:30:00+05:30 IST

పచ్చ బంగారంలా మెరిసిపోయే మామిడిపళ్లు తినకుండా ఉండడం ఎవరి తరం? అయితే మార్కెట్లో దొరికే ఎక్కువ శాతం మామిడిపళ్లు సహజంగా పక్వానికి రాక ముందే, కృత్రిమంగా పండించేస్తూ ఉంటారు...

మామిడిపళ్లు చెట్టుకే పండాయా?

పచ్చ బంగారంలా మెరిసిపోయే మామిడిపళ్లు తినకుండా ఉండడం ఎవరి తరం? అయితే మార్కెట్లో దొరికే ఎక్కువ శాతం మామిడిపళ్లు సహజంగా పక్వానికి రాక ముందే, కృత్రిమంగా పండించేస్తూ ఉంటారు. ఇలాంటి పళ్లను కనిపెట్టి, మేలు రకం మామిడిపళ్లు ఎంచుకోవాలి.


కృత్రిమంగా పళ్లను పండించడం కోసం కాల్షియం కార్బైడ్‌ అనే రసాయనాన్ని వాడుతూ ఉంటారు. ఇలా పండించిన పళ్లతో నాడీసంబంధ సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా తలతిరుగుడు, మత్తు, అయోమయం, జ్ఞాపకశక్తి సన్నగిల్లడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. క్యాల్షియం కార్బైడ్‌కు, ఆర్సినిక్‌, ఫాస్ఫరస్‌ హైడ్రైడ్‌ అనే రసాయనాలు కూడా తోడైతే శరీరంలో హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది. ఈ రసాయనాలతో పండిన మామిడిపళ్లు రుచిలో చప్పగా ఉండడంతో పాటు తేలికగా పాడైపోతూ ఉంటాయి. కాయ ఎంత పచ్చిగా ఉంటే, అంత ఎక్కువ కార్బైడ్‌ వాడుతూ ఉంటారు. ఎంత ఎక్కువ కార్బైడ్‌ వాడితే, పండులో అంత టాక్సిసిటీ చేరుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇలా కృత్రిమంగా పండించిన పళ్లను కనిపెట్టడం కోసం ఓ చిట్కా పాటించాలి.


  1. మామిడిపళ్లను నీళ్లు నింపిన బక్కెట్‌లో వేయాలి. పళ్లు మునిగితే అవి సహజసిద్ధంగా పండినవనీ, తేలితే కార్బైడ్‌తో పండినవనీ అర్ధం చేసుకోవాలి. అలాగే తింటున్నప్పుడు గొంతులో మంటగా ఉన్నా వాటిని కార్బైడ్‌తో పండించారని గ్రహించాలి.
  2. కృత్రిమంగా పండించిన మామిడి పళ్ల పసుపుదనం సమంగా ఉండదు. అక్కడక్కడా ఆకుపచ్చ రంగు మచ్చలు ఉంటాయి.
  3. పండును పిండినప్పుడు తేలికగా రసం కారితే సహజసిద్ధంగా పండిందని అర్ధం. అలా కాకుండా రసం కొద్దిగా ఉన్నా, అసలు రసమే లేకపోయినా కృత్రిమంగా పండించిందని అనుకోవాలి.

Updated Date - 2021-05-05T05:30:00+05:30 IST