బాలుకు భారతరత్న ఇవ్వాలి: నాట్స్

ABN , First Publish Date - 2020-09-30T15:08:40+05:30 IST

గాన గాంధర్వుడు ఎస్.పి. బాల సుబ్రమణ్యం భారతరత్నకు అసలు సిసలైన అర్హుడని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తెలిపింది.

బాలుకు భారతరత్న ఇవ్వాలి: నాట్స్

బాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన నాట్స్

గాన గాంధర్వుడు ఎస్.పి. బాల సుబ్రమణ్యం భారతరత్నకు అసలు సిసలైన అర్హుడని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తెలిపింది. భారతదేశంలో 14 భాషాల్లో పాటలు పాడి.. భారతీయుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న బాలుకు భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాలని.. ఈ దిశగా భారత ప్రభుత్వం ఆలోచించాలని నాట్స్ కార్యవర్గం కోరింది. బాలు మృతి తెలుగువారికే కాదు యావత్ భారతావనికే తీరని లోటని నాట్స్ పేర్కొంది. అమెరికాలో నిర్వహించిన బాలు షోలకు తెలుగు వారితో పాటు ఇతర భాషలకు చెందిన ప్రవాస భారతీయులు కూడా పాల్గొనేవారని ఈ సందర్భంగా నాట్స్ నాయకులు పేర్కొన్నారు. కరోనాతో పోరాడుతున్న బాలు కోలుకుంటున్నారన్న సమయంలో.. ఒక్కసారిగా ఆయన మృతి వార్త తమను తీవ్రంగా కలిచివేసిందని నాట్స్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని అన్నారు. 


గానగంధర్వునితో తనకు మంచి అనుబంధం ఉందని.. నాట్స్ నాయకులు మోహనకృష్ణ మన్నవ అన్నారు. న్యూజెర్సీలో పాడుతా తీయగా సమయంలో బాలు గారిని తీసుకెళ్లడానికి వెళ్లాను. ఆ సమయంలో నేనే డ్రైవింగ్ చేస్తున్నాను. నేను స్థానికంగా అక్కడ  ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడంతో  నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. నేను కాల్స్ అటెండ్ చేయలేని పరిస్థితుల్లో బాలు గారే స్వయంగా కాల్స్ అటెండ్ చేసి నేను బాలు మాట్లాడుతున్నాను. నన్ను తీసుకురావడానికి మోహన్ గారు రావడం.. ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం వల్ల ఆలస్యం అవుతుంది. దీనికి మీరు నన్ను క్షమించాలి అంటూ నాకు వచ్చిన కాల్స్‌కు ఆయన సమాధానం ఇచ్చిన తీరు నిజంగా నా జీవితంలో మరిచిపోలేనిది. ఎంత ఎదిగినా.. ఒదిగే ఉండే మనస్తత్వం ఆయనది అని మోహన కృష్ణ మన్నవ బాలుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 


అమెరికాలో పాడుతా తీయగా కార్యక్రమాన్ని నాట్స్ ద్వారా నిర్వహించేందుకు అవకాశం ఇచ్చారని.. ఆ సమయంలో ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా మరిచిపోలేని అనుభూతి అని నాట్స్ నాయకులు బాపు నూతి అన్నారు. ఆత్మీయంగా పలకరించడం.. అందరిని కలుపుకొనిపోవడం నిజంగా ఆయన నుంచి నేర్చుకున్నామని బాపు నూతి అన్నారు. డాలస్‌లో నిర్వహించిన పాడుతా తీయగాలో నాట్స్ నాయకులు బాపునూతి, విజయ్ శేఖర్ అన్నే బాలుతో కలిసి పనిచేసిన అనుభవాలను నాట్స్ సభ్యులతో పంచుకున్నారు. డాలస్‌లో బాలు గారి పాడుతా తీయగా కార్యక్రమం సందర్భంగా నిండు సభలో స్టేజీ మీద నన్ను ఆలింగనం చేసుకొని అభినందనలు తెలియజేయడం మరిచిపోలేనిదని నాట్స్ అధ్యక్షులు శేఖర్ అన్నే గుర్తు చేసుకున్నారు. నాట్స్ నాయకులు మధు కొర్రపాటికి కూడా బాలుతో ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. ఎప్పుడూ న్యూయార్క్ వచ్చినా తమ ఇంటిలోనే విడిది చేసే వారని మధు కొర్రపాటి గుర్తు చేసుకున్నారు. సెయింట్ లూయిస్‌లో పాడుతా తీయగా జరిగినప్పుడు బాలుతో తాను కలిసి పనిచేయడం అదృష్టంగా భావించానని.. నిజంగా ఆ రోజులు మరిచిపోలేనని నాట్స్ నాయకులు శ్రీనివాస్ మంచికలపూడి అన్నారు. 


బాలు కుటుంబ సభ్యులకు అమెరికాలో ఉండే తెలుగు వారి తరపున నాట్స్ నాయకులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాలు మన మధ్య లేకపోవచ్చు. కానీ ఆయన పాట ద్వారా సంగీత ప్రియుల గుండెల్లో చిరంజీవిగా నిలిచిపోతారన్నారు. అత్యంత ఆత్మీయ మిత్రుడిని నాట్స్ కుటుంబం కోల్పోయిందని బాలు ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. నాట్స్ మాజీ చైర్మన్లు, మాజీ అధ్యక్షులు, బోర్డు అఫ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, చాప్టర్ కోఆర్డినేటర్లు, నేషనల్ కోఆర్డినేటర్లు, హెల్ప్‌లైన్ సభ్యులు, నాట్స్ అభిమానులు, తెలుగు వారు, బాలు గారితో నాట్స్ లోని ప్రతీ ఒక్కరూ తమ తమ నగరాల్లో జరిగిన సభలు, సన్మానాలు తలచుకుని బాలు గారితో అందరూ తమ తమ అనుబంధాలను ఫోన్ ద్వారా పంచుకున్నారు. 


Updated Date - 2020-09-30T15:08:40+05:30 IST