మీటర్లు రైతుల పాలిట తూటాలు
ABN , First Publish Date - 2020-09-25T08:41:59+05:30 IST
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు బిగించే కరెంటు మీటర్లు రైతుల పాలిట తూటాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెడితే రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్రం ఆఫర్ ఇస్తే, దానిని తిరస్కరించి, కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతోందని చెప్పారు...
- వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్త నిరసనలు
- కేసీఆర్కు క్షీరాభిషేకాలు.. ప్రధానికి నిరసనలు: హరీశ్
దుబ్బాక, సెప్టెంబరు 24: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు బిగించే కరెంటు మీటర్లు రైతుల పాలిట తూటాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెడితే రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్రం ఆఫర్ ఇస్తే, దానిని తిరస్కరించి, కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతోందని చెప్పారు. గురువారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి సంఘంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి హరీశ్ రైతులకు పాసు బుక్కులను అందజేశారు. రైతులను ఆర్థికంగా నిలబెట్టాలని, వారిని పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హరీశ్ పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపడుతున్న సంస్కరణలు, సంక్షేమాలను చూసి రైతులు క్షీరాభిషేకాలు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వంపై దేశం మొత్తం నిరసనలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న ప్రభుత్వం తమదని, రైతులను దెబ్బతీసే కేంద్రం విధానాలను వ్యతిరేకించాలని హరీశ్రావు పేర్కొన్నారు. విదేశీ మక్కలను దిగుమతి చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మక్కలను పారబోసే పరిస్థితి తెస్తోందని ఆరోపించారు. ప్రజలు సోయి తెచ్చుకుని, దుబ్బాక పౌరుషాన్ని ఢిల్లీకి చాటాలని హరీశ్ పిలుపునిచ్చారు.