కొత్త జాతీయ రికార్డుతో.. నీరజ్‌కు రజతం

ABN , First Publish Date - 2022-07-01T09:39:10+05:30 IST

ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌లో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌, ఒలింపిక్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా రజత పతకం సాధించాడు.

కొత్త జాతీయ రికార్డుతో..  నీరజ్‌కు రజతం

స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌ 

స్టాక్‌హోమ్‌: ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌లో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌, ఒలింపిక్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా రజత పతకం సాధించాడు. గురువారం జరిగిన ఈవెంట్‌లో నీరజ్‌ జావెలిన్‌ను 89.94 మీటర్లు త్రో చేసి రెండో స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలోనే ఈ దూరం విసిరిన చోప్రా వ్యక్తిగత, జాతీయ రికార్డుతోపాటు మీట్‌ రికార్డు నెలకొల్పాడు. కానీ వరల్డ్‌ చాంపియన్‌ ఆండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనడా) రెండో ప్రయత్నంలో 90.31 మీ. దూరంతో నీరజ్‌ మీట్‌ రికార్డును సవరించి.. సరికొత్త రికార్డు సృష్టించాడు. పీటర్స్‌ స్వర్ణం కైవసం చేసుకోగా..జూలియన్‌ వెబర్‌ (జర్మనీ) 89.08 మీ.లతో కాంస్య పతకం దక్కించుకున్నాడు. ఇప్పటిదాకా ఏడుసార్లు డైమండ్‌ లీగ్‌లో తలపడిన నీరజ్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. గతంలో అతడు ఉత్తమంగా నాలుగో స్థానంలో నిలిచాడు. 

Updated Date - 2022-07-01T09:39:10+05:30 IST