రెండోరోజు ఈడీ విచారణకు Rahul Gandhi
ABN , First Publish Date - 2022-06-14T16:44:27+05:30 IST
నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం రెండో రోజు ప్రశ్నించనుంది....
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం రెండో రోజు ప్రశ్నించనుంది.మంగళవారం ఈడీ కార్యాలయానికి రాహుల్ గాంధీ చేరుకున్నారు. రాహుల్ గాంధీ వెంట ఈడీ కార్యాలయానికి ప్రియాంక గాంధీ వచ్చారు.దీంతో ఢిల్లీలోని వీధుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేశారు. సోమవారం నాడు పోలీసులు పలువురు కాంగ్రెస్ అగ్రనేతలను అదుపులోకి తీసుకున్నారు.మంగళవారం కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన కొనసాగుతుందని కాంగ్రెస్ నేత హరీష్ రావత్ తెలిపారు. టెన్ జన్ పథ్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనలతో పోలీసులు అప్రమత్తమై భారీగా మోహరించారు.
పోలీసులు మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ‘‘మేం ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము. కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీని, మా పార్టీ గొంతును అణిచివేసేందుకు ప్రయత్నించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది’’ అని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఢిల్లీలో ట్రాఫిక్కు సంబంధించి మంగళవారం పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. గోల్ మేథీ జంక్షన్, తుగ్లక్ రోడ్ జంక్షన్, క్లారిడ్జ్ జంక్షన్, క్యూ-పాయింట్ జంక్షన్, సున్హారీ మసీదు జంక్షన్, మౌలానా ఆజాద్ రోడ్ జంక్షన్, మాన్ సింగ్ రోడ్ జంక్షన్లలో ఉదయం 7 గంటల నుంచి 12 గంటల మధ్య ప్రయాణించకుండా ఉండాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.