జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా పర్యవేక్షణాధికారిగా లోకవర్ధన్
ABN , First Publish Date - 2022-08-19T04:35:43+05:30 IST
జిల్లా జాతీయ ఆరోగ్యమిషన్ పర్యవేక్షణాధికారిగా డాక్టర్ లోకవర్ధన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాయచోటి టౌన్, ఆగస్టు 18: జిల్లా జాతీయ ఆరోగ్యమిషన్ పర్యవేక్షణాధికారిగా డాక్టర్ లోకవర్ధన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ లోకవర్ధన్ గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్వోగా దాదాపు ఒకటిన్నర సంవత్సరం పూర్తి అదనపు బాధ్యతలతో పనిచేశారు. అనంతరం చిత్తూరు జిల్లా 104, 108 సేవల జిల్లా నోడల్ అధికారిగా, చిత్తూరు జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల జిల్లా నోడల్ అధికారిగా కూడా సేవలు అందించారు. అనంతరం నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల ప్రోగ్రాం అధికారిగా సేవలు అందిస్తున్నారు. గురువారం రాయచోటి పట్టణంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో జాతీయ ఆరోగ్య మిషన్ పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు వంద శాతం అమలుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వోతో పాటు ఇతర అధికారులు డాక్టర్ లోకవర్ధన్కు శుభాకాంక్షలు తెలిపారు.