జాతీయ క్రీడలు.. యువ అథ్లెట్లకు అద్భుత వేదిక
ABN , First Publish Date - 2022-09-30T09:33:04+05:30 IST
జాతీయ క్రీడలకు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా తెరలేచింది. తరలి వచ్చిన క్రీడాకారులు, అభిమానులతో ప్రపంచంలోని అతిపెద్ద నరేంద్ర మోదీ స్టేడియం కిక్కిరిసింది..
ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
అనంతరం స్వర్ణిమ్ గుజరాత్ స్పోర్ట్స్ యూనివర్సిటీని వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ.. జాతీయ క్రీడల ఆరంభ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా అథ్లెట్లనుద్దేశించి ఆయన ఉత్తేజిత ప్రసంగం చేశారు. ‘ఈ అపురూపమైన క్షణాలను మాటల్లో వర్ణించలేను. ప్రపంచంలోనే అతిపెద్దదైన స్టేడియంగల దేశం, ప్రపంచంలోనే అత్యధిక పిన్నవయస్కులున్న దేశం భారత్ అతిపెద్దదైన క్రీడా సంరంభాన్ని జరుపుకొంటోంది. ఈ క్రీడలు యువ అథ్లెట్లకు ఎదుగుదల (లాంచ్పాడ్)గా పనిచేస్తాయి. ఈ టోర్నీ వారికి అద్భుతమైన వేదిక. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని ప్రధాని అన్నారు. ‘భారత్ను ఏకం చేస్తుంది..విజయాలను చేకూరుస్తుంది’ అన్న జాతీయ క్రీడల సందేశాన్ని మోదీ ప్రశంసించారు. గత ఎనిమిదేళ్లలో క్రీడల బడ్జెట్ను 70 శాతం పెంచామని ఆయన వెల్లడించారు.
ఒలింపిక్స్ సహా ఇతర అంతర్జాతీయ క్రీడా వేదికలపై మన అథ్లెట్లు పెద్ద సంఖ్యలో పతకాలు సాధిస్తుండడాన్ని గుర్తు చేశారు. అంతేకాదు.. గత పాలకుల వైఫల్యం కారణంగా ప్రతిభ ఉన్నా కూడా అథ్లెట్లు అంతర్జాతీయ స్థాయిలో రాణించలే కపోయారన్నారు. ‘గతంలోనూ అథ్లెట్లకు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటే సామర్ధ్యమున్నప్పటికీ.. గత పాలకుల అశ్రిత పక్షపాతం, అవినీతి వంటి కారణాలతో క్రీడాకారులు ప్రతిభను చాటుకోలేకపోయారు. కానీ, ఇప్పుడలా కాదు. అథ్లెట్లకు ప్రభుత్వ ప్రోత్సాహం మెండుగా ఉంది. అంతర్జాతీయ వేదికలపై అద్భుత ఫలితాలు రాబడుతున్నారు’ అని ప్రధాని పేర్కొన్నారు. జాతీయ క్రీడల మస్కట్ ‘సవజ్’ను ఆయన ప్రస్తావిస్తూ.. ‘గిర్ సింహాలు స్పూర్తిగా సవజ్ను రూపొందించారు. అది మన క్రీడాకారుల శ్రమ, పట్టుదలను తెలియజేస్తుంది’ అని అన్నారు. మార్చ్పాస్ట్ ఆసాంతం వేదికపై నిలుచొన్న ప్రధాని.. అథ్లెట్లను చప్పట్లతో స్వాగతించారు.
‘టార్చ్ ఆఫ్ యూనిటీ’
ఒలింపిక్స్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ క్రీడాజ్యోతిని తీసుకురావడం ఈసారి జాతీయ క్రీడల్లో విశేషం. కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.
నెట్బాల్ ఫైనల్లో తెలంగాణ
జాతీయ క్రీడల్లో తెలంగాణ జట్టు ఓ పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల నెట్బాల్లో ఫైనల్కు దూసుకెళ్లి పసిడి పతకానికి అడుగు దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో తెలంగాణ 55-53తో ఆతిథ్య గుజరాత్పై గెలిచింది.
అహ్మదాబాద్: జాతీయ క్రీడలకు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా తెరలేచింది. తరలి వచ్చిన క్రీడాకారులు, అభిమానులతో ప్రపంచంలోని అతిపెద్ద నరేంద్ర మోదీ స్టేడియం కిక్కిరిసింది.. విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది.. తరలి వచ్చిన ఒలింపిక్ పతక విజేతలు నీరజ్ చోప్రా, పీవీ సింధు, మీరాబాయ్ చాను, రవి దహియాలతో కొత్త సొబగులు అద్దుకుంది.. ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు, బాణసంచా వెలుగు జిలుగులు.. ఇలాంటి అద్భుత వాతావరణంలో జాతీయ క్రీడా సంబరం ఘనంగా మొదలైంది. లక్షమంది ప్రేక్షకులు హర్షధ్వానాలతో స్వాగతం పలకగా ముసిముసి నవ్వులు చిందిస్తూ.. వారికి రెండు చేతులతో అభివాదం చేస్తూ ప్రధాని మోదీ స్టేడియంలోకి ప్రవేశించారు.