తిరుపతి సైబర్ వింగ్కు జాతీయ అవార్డులు
ABN , First Publish Date - 2022-01-18T09:25:11+05:30 IST
తిరుపతి అర్బన్జిల్లా పోలీస్ సైబర్ వింగ్కు జాతీయస్థాయి అవార్డులు
- బెస్ట్ టీమ్ మెంటార్గా ఎస్పీ వెంకట అప్పల నాయుడు
- ఉత్తమ ఇన్వెస్టిగేటర్గా సీఐ సుబ్రహ్మణ్యంరెడ్డి
తిరుపతి(నేరవిభాగం), జనవరి 17: తిరుపతి అర్బన్జిల్లా పోలీస్ సైబర్ వింగ్కు జాతీయస్థాయి అవార్డులు లభించాయి. ఎస్పీ వెంకట అప్పల నాయుడికి బెస్ట్ సైబర్ టీమ్ మెంటార్, సైబర్ వింగ్ సీఐ వి.సుబ్రహ్మణ్యంరెడ్డికి బెస్ట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ అవార్డు లభించాయి. నేషనల్ సైబర్ అవార్డ్స్-2021 కోసం బెస్ట్ ప్రాక్టీసెస్ మీట్-3.0 పోటీలు గత నెలలో వర్చువల్గా జరిగాయి. దేశవ్యాప్తంగా 784 జిల్లాల పోలీసు సైబర్ విభాగాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. సంవత్సర కాలంగా ఆయా జిల్లాల సైబర్ పోలీస్ విభాగాలు చేపట్టిన కేసులు, దర్యాప్తు, పరిష్కరించిన విధానాల గురించి నివేదికలు సమర్పించాయి. పరిశీలించిన జాతీయ కమిటీ ఉత్తమ దర్యాప్తు సైబర్ పోలీసు విభాగాలకు అవార్డులు ప్రకటించింది.