నల్లగొండ వైద్యులకు జాతీయ అవార్డులు
ABN , First Publish Date - 2022-07-02T05:56:29+05:30 IST
జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు వైద్యులకు జాతీయ స్థాయిలో అవార్డులు దక్కాయి. జాతీయ డాక్టర్ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన వేర్వేరు కార్యక్ర
నల్లగొండ అర్బన్, జూలై 1 : జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు వైద్యులకు జాతీయ స్థాయిలో అవార్డులు దక్కాయి. జాతీయ డాక్టర్ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ వసంతకుమారితో పాటు ఆయూష్ రెసిడెన్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ అవార్డులు అందుకు న్నారు. వసంతకుమారి వైద్యవృత్తిలో ఉంటూ సమాజ సేవా కార్యక్రమాలతో పాటు మహిళల ఆరోగ్యంపై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నందుకు ఐఎంఏ ఆమె సేవలను గుర్తించి డాక్టర్ ఆఫ్ ది డికేడ్ అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డును శుక్రవారం ఢిల్లీలోని ఐఎంఏ భవనంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ, ఐఎంఏ నేషనల్ అధ్యక్షుడు డాక్టర్ సహజానన్ సింగ్ నుంచి అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కలిపి డాక్టర్ వసంత కుమారికే ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో కాలంగా వైద్య సేవలతో పాటు సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, మహిళా ఐఎంఏ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యం కోసం అనేక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ అవార్డు స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అదేవిధంగా ఆయూష్ విభాగంలో రెసిడెన్స్ మెడికల్ సూపరింటెండెంట్గా ఉత్తమ సేవలందించినందుకు జిల్లాకు చెందిన ఆయూష్ డాక్టర్ ఆనంద్కు డిప్యూటీ కమిషనర్ శేషాంక ఢిల్లీలో ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ప్రశంసా స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.