సమైక్యత చాటేందుకే జాతీయ గీతాలాపన
ABN , First Publish Date - 2022-08-17T05:26:34+05:30 IST
భారతదేశ సమైక్యత చాటేందుకు సామూహిక జాతీయ గీతాలాపన అని, ఇందులో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందని అటవీ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
నిర్మల్ కల్చరల్, ఆగస్టు 16 : భారతదేశ సమైక్యత చాటేందుకు సామూహిక జాతీయ గీతాలాపన అని, ఇందులో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందని అటవీ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. భారతదేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మంత్రి ఎన్టీఆర్ మినీ స్టేడియంలో విద్యార్థులతో కలిసి బెలూన్లు ఎగురవేసి దేశభక్తిని చాటారు. అక్కడి నుంచి మినీ ట్యాంక్బండ్ వరకు జాతీయజెండాను చేతపట్టుకొని నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహి స్తోందన్నారు. జాతీయతా భావం పెంపొందించేందుకు గత వారం రోజులుగా వజ్రోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయని, ఈ నెల 22 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జాతీయ గీతాలాపన చరిత్రాత్మక ఘట్టమని, దేశ ప్రజలందరూ 11:30 నిమిషాలకు సామూహికంగా జాతీయ గీతం ఆలపించడం ప్రపంచ దేశాలకు ఐక్యత, సమగ్రత చాటినట్టని అన్నారు. జిల్లాలో ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనడం విశేషమని అభివర్ణిం చారు. ఈ ర్యాలీ అందరినీ ఆకర్షించింది. జడ్పీ చైర్పర్సన్ కే.విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్కుమార్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, నాయకులు ధర్మాజీ రాజేందర్, మారుగొండ రాము, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, అధికార యంత్రాంగంతో పాటు యూత్ విద్యార్థులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబరాల్లో భాగంగా మంగళవారం తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఆపరేషన్స్ సర్కిల్ కార్యా లయంలో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు.
దిలావర్పూర్ : మండలంలోని ఆయాగ్రామాల్లో మంగళవారం సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. సరిగ్గా ఉదయం 11:30 గంటలకు ఎక్కడివారు అక్కడే జాతీయగీతాన్ని ఆలపించారు. కాల్వ, సముందర్పల్లి, బన్సపల్లి, న్యూ లోలం, సిర్గాపూర్, గుండంపల్లి, కాల్వతండా గ్రామాల్లో గ్రామస్థులంతా ఒకేచోటుకు చేరి గీతాలాపనలో పాల్గొన్నారు.
భైంసా రూరల్ : మండలంలోని వానల్పాడ్ గ్రామంలో మంగళవారం సామూహిక గీతాలాపన 11:30 నిమిషాలకు నిర్వహించారు. ప్రభుత్వ అధి కారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, గ్రామప్రజలు తమ దేశభక్తిని చాటా రు. ఎంపీపీ జాదవ్కల్పన గణేష్, ఎంపీడీవో గంగాధర్, ఎస్సై శ్రీకాంత్, డీఎల్పీవో శివకృష్ణ, టీఆర్ఎస్ నాయకుడు రామన్న, గణేష్, ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.