నాట్కో ఫార్మా విరాళం 2.50 కోట్లు
ABN , First Publish Date - 2020-04-10T06:51:41+05:30 IST
ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నాట్కో ఫార్మా లిమిటెడ్ సీఎండీ నన్నపనేని వెంకయ్య చౌదరి...
- రూ.1.50 కోట్ల మందులు కూడా
- సువెన్ లైఫ్ సైన్సెస్ రూ.కోటి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్) : ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నాట్కో ఫార్మా లిమిటెడ్ సీఎండీ నన్నపనేని వెంకయ్య చౌదరి రూ.2.50 కోట్లను ఎస్బీఐ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపారు. రూ.1.50 కోట్ల విలువైన పీపీఈ కిట్లను, హైడ్రాక్సి క్లోరోక్విన్ ముందులను ఏపీఎంఎ్సఐడీసీ సంస్థకు అందజేశారు. వరుణ్ గ్రూప్ చైర్మన్ వి.ప్రభు కిశోర్, ఎండీ వి.వరుణ్దేవ్ గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలసి రూ.2కోట్ల విరాళం అందజేశారు.
అలాగే, నరసారావుపేటకు చెందిన వైద్యులు, వ్యాపార వేత్తలు, ప్రజల తరఫున కోటీ 18వేల 227 రూపాయలను సీఎం జగన్కు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఇక, సువెన్ లైఫ్ సైన్సెస్ సంస్థ సీఈవో జాస్తి వెంకట్ రూ.కోటి విరాళాన్ని జగన్కు చెక్ రూపంలో అందజేశారు. అలాగే డీజీపీ సవాంగ్ను కలిసిన జాస్తి వెంకట్ పోలీసు సంక్షేమ నిధికి రూ.50 లక్షల విరాళాన్ని అందజేశారు. విజయవాడ రోమన్ కేథలిక్ డయోసిస్ బిషప్ జోసఫ్ రాజారావు సీఎం జగన్కు రూ.25 లక్షల విరాళం అందజేశారు. గుంటూరు రోమన్ కేథలిక్ డయోసిస్ తరఫున బిషప్ భాగ్యయ్య రూ.25 లక్షల చెక్ను సీఎంకు అందజేశారు. అలాగే, విశాఖ ఆర్సీఎం చర్చి, సెయింట్ ఏన్స్ సంస్థలు రూ.67 లక్షలు విరాళం ప్రకటించాయి. ఇదిలావుండగా, గుంటూరుజిల్లా పలకలూరు విజ్ఞాన్ నిరులా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ రాధిక, నలుబోలు విష్ణు దంపతుల కుమార్తె విజయలక్ష్మి వివాహం స్వగృహంలో నిరాడంబరంగా జరిపించారు. హాజరైన నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలుకు కరోనా సహాయక చర్యల కోసం నూతన దంపతులు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు.
నారాయణ, సన్ నెట్వర్క్ భూరి విరాళం
నారాయణ విద్యాసంస్థలు రూ.2కోట్ల విరాళం ప్రకటించాయి. తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.కోటి ఇవ్వగా.. ఏపీకి త్వరలో రూ.కోటి అందిస్తామని విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత్ తెలిపారు. పీఎంకేర్స్ ఫండ్కు సన్నెట్వర్క్ రూ.10కోట్లు, జిందాల్స్టీల్ రూ.5కోట్లు ప్రకటించాయి. విరూపాక్ష ఆర్గానిక్స్ రూ.10 లక్షలు ఇచ్చాయి.