నర్సింగానంద్‌ను అరెస్ట్ చేసింది ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలకు కాదట!

ABN , First Publish Date - 2022-01-17T01:43:52+05:30 IST

హరిద్వార్ సభ కంటే ముందు నిర్వహించిన సభలో మహిళలపై అభ్యంతరకరంగా వ్యాఖ్యానించినట్లు ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, దాని ఆధారంగానే యతి నర్సింగారావును అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు..

నర్సింగానంద్‌ను అరెస్ట్ చేసింది ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలకు కాదట!

డెహ్రడూన్: హరాద్వార్‌లో జరిగిన హిందూ సాధువుల ధర్మ సంసద్ సభలో యతి నర్సింగానంద్ అనే ఒక సాధువు ముస్లింలపై మహాత్మ గాంధీపై విద్వేష వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఎట్టకేలకు యతి నర్సింగానంద్ సహా మరికొంత మంది సాధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు కూడా. అయితే వారిని అరెస్ట్ చేసింది ముస్లింలు, గాంధీపై చేసిన విద్వేష వ్యాఖ్యలకు కాదని పోలీసులు తాజాగా తెలిపారు. మహిళలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.


హరిద్వార్ సభ కంటే ముందు నిర్వహించిన సభలో మహిళలపై అభ్యంతరకరంగా వ్యాఖ్యానించినట్లు ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, దాని ఆధారంగానే యతి నర్సింగానంద్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే హరిద్వార్‌లో నిర్వహించిన ధర్మ సంసద్ సభలో చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ కాపీలో పేర్కొనకపోవడం గమనార్హం.


వాస్తవానికి హరిద్వార్‌లో ధర్మ సంసద్ సభ జరిగిన చాలా రోజులకు నర్సింగానంద్ సహా మరికొంత మందిపై పోలీసు కేసు నమోదు చేశారు. నెల రోజుల తర్వాత వారిని అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో పోలీసులకు నర్సింగారావు బెదిరింపులకు పాల్పడ్డారు. ‘‘మీరు, మీ పిల్లలు చచ్చిపోతారు’’ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు.

Updated Date - 2022-01-17T01:43:52+05:30 IST