‘హే మళ్లీ ఏసేశాడు’... మహేశ్ డైలాగ్‌తో రఘురామరాజు స్ట్రాంగ్ కౌంటర్

ABN , First Publish Date - 2020-08-13T18:55:53+05:30 IST

అమరావతి రాజధానిపై మాట్లాడటానికి తనకేం సంబంధమన్న వైసీపీ నేతలపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో

‘హే మళ్లీ ఏసేశాడు’... మహేశ్ డైలాగ్‌తో రఘురామరాజు స్ట్రాంగ్ కౌంటర్

ఇంటర్నెట్ డెస్క్: అమరావతి రాజధానిపై మాట్లాడటానికి తనకేం సంబంధమన్న వైసీపీ నేతలపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. తనకే సంబంధం ఉందని.. కొంతమంది పిచ్చి కూతలు వాగుతున్నారని ఘాటుగా విమర్శించారు. ‘నేనే హీరోనంటూ.. పక్కనోలు జీరోలు’ అన్నట్టు మాట్లాడొద్దని హితవు పలికారు. అమరావతిపై మాట్లాడటం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ‘‘విజయవాడ నేను పుట్టి పెరిగిన ప్రాంతం. ఇక్కడి పరిస్థితులపై నాకు అవగాహన ఉంది. రాజధానికి ఇది సరైన ప్రాంతం. అలాగే పుట్టి, పెరిగిన ఊరుగా నాకు కొద్దిగా స్వార్థం కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమే చెల్లుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు చెల్లవు. అమరావతే రాజధానిగా ఉంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఏదీ సాగదు’’ అని తేల్చి చెప్పారు.


ఇక ప్రభుత్వంలో రెడ్లకు ప్రాధాన్యంపై మాట్లాడుతూ.. ‘‘మీరు కులాలకు అతీతమైన క్రైస్తవంలో ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని పోస్టులు రెడ్లకే ఇస్తున్నారు. రెడ్ టేపిజం లేదు కానీ ‘రెడ్డి ఇజం’ ఉంది. క్వాలిఫికేషన్ లేకున్నా అన్నీ రెడ్లకే ఇస్తున్నారు. చైర్మన్ పోస్టు ఉంటే రెడ్డికి... ఎక్కడైనా రెండు పోస్టులు ఉంటే ఒకటి రెడ్డికే ఇస్తున్నారు. నాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలి. రెడ్డి జులుం చేస్తున్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.. పార్టీకి ప్రభుత్వానికి తేడా లేదా.. ప్రభుత్వం పేరు చెప్పి పార్టీకి పని చేయించుకుంటారా? ఇవాళ కడుపు మండి ప్రశ్నిస్తున్నాను. రేపు ప్రజలు కూడా ప్రశ్నించకుండా ఉండరు. ప్రశ్నిస్తే జైల్లో పెడతారా? క్వాలిఫికేషన్ లేని ప్రతి రెడ్డికి ప్రభుత్వంలో ఉద్యోగమిస్తారా? పీపీఈ కిట్లు అడిగిన దళిత డాక్టర్‌ను పిచ్చోడిగా ముద్రేశారు. నాపై అవాకులు చవాకులు పేలిన వ్యక్తి రెడ్డి కాబట్టి మాట్లాడరా... జగన్మోహన్ రెడ్డి ఆలోచించండి. మంచి చేస్తే మూడు దశాబ్దాలు ఉంటారు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. 


ఈ సందర్భంగా టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ, మహేశ్ బాబు ‘దూకుడు’ సినిమాను ప్రస్తావిస్తూ.. ఆ సినిమాలో ‘హే మళ్లీ ఏసేశాడు’ అనే డైలాగ్‌ను వినిపించారు. రెడ్లకు ప్రాధాన్యమిస్తున్నారని.. ఎస్వీబీసీ నుంచి ఏ డిపార్ట్ మెంట్ చూసుకున్నా వాళ్లే ఉన్నారంటూ పేరు పేరును చదివి వినిపించారు. ఫలానా శాఖలో ఈ రెడ్డి.. ఫలానా శాఖలో ఆ రెడ్డి అంటూ హే మళ్లీ ఏసేశాడు అనే డైలాగ్‌ను రఘురామకృష్ణం రాజు పేల్చారు. 

Updated Date - 2020-08-13T18:55:53+05:30 IST