రాజకీయాల్లోకి రావడం లేదు.. తేల్చేసిన పటీదార్ నేత

ABN , First Publish Date - 2022-06-17T02:16:42+05:30 IST

గుజరాత్ ఎన్నికల వేళ పటీదార్ నేత నరేష్ పటేల్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ఇటీవల వార్తలు చక్కర్లు

రాజకీయాల్లోకి రావడం లేదు.. తేల్చేసిన పటీదార్ నేత

రాజ్‌కోట్: గుజరాత్ ఎన్నికల వేళ పటీదార్ నేత నరేష్ పటేల్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ఊహాగానాలను కొట్టివేస్తూ తాజాగా ఆయన సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి రాబోవడం లేదని తేల్చి చెప్పారు. తమ సామాజికవర్గంలోని పెద్దలు ఇందుకు వ్యతిరేకంగా ఉన్నారని, కాబట్టి ఇప్పటికైతే తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే, రాజకీయాలపై బోధించేందుకు త్వరలోనే ఓ అకాడమీని ప్రారంభిస్తామని తెలిపారు.

 

 తాను రాజకీయాల్లో చేరాలా వద్దా అనే అంశంపై తాను చైర్మన్‌గా ఉన్న శ్రీ ఖోదల్‌దామ్ ట్రస్ట్ సర్వే నిర్వహించిందని తెలిపారు. అందులో తన లెయువా పటేల్ కమ్యూనిటీ సభ్యులతోపాటు ఇతర భాగస్వాములు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు నరేష్ పటేల్ తెలిపారు. దీంతో పెద్దల సలహా మేరకు నడుచుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. దాదాపు 80 శాతం మంది యువత తాను రాజకీయాల్లోకి రావాలనే కోరుకుంటున్నారని చెప్పారు. అలాగే, 50 శాతం మంది మహిళలు కూడా తాను రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనకు మద్దతు పలికారని వివరించారు. అయితే, తమ కమ్యూనిటీలోని పెద్దలు మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని, దీంతో రాజకీయాల్లో రావాలన్న ఆలోచనను విరమించుకున్నట్టు చెప్పారు.  

Updated Date - 2022-06-17T02:16:42+05:30 IST