ఎంపీ గోరంట్లపై నారీ భేరి..
ABN , First Publish Date - 2022-08-10T07:05:48+05:30 IST
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోవాలని, మూడేళ్లుగా మహిళలపై జరుగుతున్న వరుస అత్యాచారాలు, లైగింకదాడులను నిరసిస్తూ ఏపీ మహిళా అఖిలపక్ష సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక హోటల్లో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎంపీ గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున డీజీపీకి వినతిపత్రం అందజేయనున్నామని, మాధవ్ వీడియో కాల్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని, రాష్ట్రంలో మూడేళ్లుగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగికదాడులపై జాతీయ మహిళా కమిషన్కు లేఖ, సోషల్ మీడియాలో మహిళలపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న వారిపై పార్టీలకు అతీతంగా పోరాడాలని, ట్విటర్ వేదికగా సిగ్నేచర్ క్యాంప్ నిర్వహించాలని, విజయవాడలో 14న డిగ్నిటీ ఫర్ ఉమెన్ వాక్ చేయాలని పలు తీర్మానాలను వాసవ్య మహిళామండలి అధ్యక్షురాలు డాక్టర్ కీర్తి ప్రవేశపెట్టారు.
- అశ్లీల వీడియో వివాదాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించాలి
- రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాల మీద జాతీయ మహిళా కమిషన్కు లేఖ
- మహిళలపై వ్యక్తిగత దూషణలకు పాల్పడితే పార్టీలకతీతంగా పోరాడాలి
- ట్విట్టర్లో సిగ్నేచర్ క్యాంప్ నిర్వహించాలి
- 14న విజయవాడలో డిగ్నిటీ ఫర్ ఉమెన్ వాక్
- రౌండ్టేబుల్ సమావేశంలో తీర్మానాలు
విజయవాడ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోవాలని, మూడేళ్లుగా మహిళలపై జరుగుతున్న వరుస అత్యాచారాలు, లైగింకదాడులను నిరసిస్తూ ఏపీ మహిళా అఖిలపక్ష సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక హోటల్లో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎంపీ గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున డీజీపీకి వినతిపత్రం అందజేయనున్నామని, మాధవ్ వీడియో కాల్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని, రాష్ట్రంలో మూడేళ్లుగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగికదాడులపై జాతీయ మహిళా కమిషన్కు లేఖ, సోషల్ మీడియాలో మహిళలపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న వారిపై పార్టీలకు అతీతంగా పోరాడాలని, ట్విటర్ వేదికగా సిగ్నేచర్ క్యాంప్ నిర్వహించాలని, విజయవాడలో 14న డిగ్నిటీ ఫర్ ఉమెన్ వాక్ చేయాలని పలు తీర్మానాలను వాసవ్య మహిళామండలి అధ్యక్షురాలు డాక్టర్ కీర్తి ప్రవేశపెట్టారు. వాటిని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ, గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో బయటపడి రోజులు గడుస్తున్నా నేటికీ చర్యలు తీసుకోకుండా సీఎం చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఫోరెన్సిక్ నివేదిక పేరుతో ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. ఏపీ మహిళాసమాఖ్య నాయకురాలు పి.దుర్గాభవాని మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళ సాధికారత, మహిళా పక్షపాత ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్నా.. మహిళలకు ఎక్కడా గౌరవస్థానం లేదని వ్యాఖ్యానించారు. క్రిమినల్స్ పార్లమెంట్లో చట్టాలను చేస్తున్నారని ఏద్దేవా చేశారు. అమరావతి మహిళల ఉద్యమం రాష్ట్రానికే తలమానికమన్నారు. వాసవ్య మహిళామండలి అధ్యక్షురాలు కీర్తి మాట్లాడుతూ, ప్రతి దశలోనూ స్ర్తీలు నాయకులుగా ఎదగాలన్నారు. జగన్మోహన్రెడ్డి ఉదాసీన వైఖరి నేరస్థులకు అస్త్రంగా మారిందని మండిపడ్డారు. మహిళల్ని కించపరిచే విధంగా ఎవరూ చేసినా తగిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలపై జరిగే దాడులను తీవ్రంగా పరిగణించాలన్నారు. మహిళలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ, సజ్జల నాలుగు గోడల మధ్య జరిగింది తప్పేంటని మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో మహిళా ఎంపీలను కలిసి పార్లమెంట్లో గళం వినిపించాలని కోరనున్నట్టు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా కలిసి పోరాడాలన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ వల్ల మహిళలకు ఒరిగిందేమీలేదన్నారు. స్ర్తీలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వమే ఆఘాయిత్యాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. లోక్సత్తా నాయకురాలు ఎన్.మాలతి మాట్లాడుతూ, మహిళలకు రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి పదవికి అనర్హుడన్నారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి వందనసమర్పణ చేశారు. కార్యక్రమంలో జనసేన కో-ఆర్డినేటర్ రావి సౌజన్య, తెలంగాణ తెలుగు మహిళా అధ్యక్షురాలు జోత్స్న, నోరి పల్లవి, పలు సామాజిక కార్యకర్తలు, అమరావతి రైతులు, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.