నాపై Hanuman Choudary క్రిమినల్ ప్రొసీడింగ్ చేపడతామన్నారు.. స్వాగతిస్తున్న: Narayana

ABN , First Publish Date - 2022-07-06T17:30:36+05:30 IST

తనపై హనుమాన్ చౌదరి క్రిమినల్ ప్రొసీడింగ్ చేపడతామన్నారని, దాన్ని స్వాగతిస్తున్నానని నారాయణ అన్నారు.

నాపై Hanuman Choudary క్రిమినల్ ప్రొసీడింగ్ చేపడతామన్నారు.. స్వాగతిస్తున్న: Narayana

విజయవాడ (Vijayawada): తనపై హనుమాన్ చౌదరి (Hanuman Choudary) క్రిమినల్ ప్రొసీడింగ్ చేపడతామన్నారని, దాన్ని స్వాగతిస్తున్నానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ (Modi)పై తాను చేసిన వ్యాఖ్యలు పబ్లిక్ అనుకునేవేనని, దానిపై చర్చకు సిద్ధమన్నారు. అల్లూరి సీతారామరాజు (Alluri Seetaramaraju) జయంతి రోజు ప్రధాని గిరిజనులపై పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారని, నేటికీ గిరిజనులపై కార్పొరేట్ సంస్థలు అడవుల్ని ఆక్రమించుకోవాలని దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సుమారు 3 లక్షల మంది గిరిజనులు రాష్ట్రంలో అడవుల్ని ఆధారం చేసుకుని జీవిస్తున్నారన్నారు. సహజ వనరుల కోసం అడవుల్ని కార్పొరేట్ సంస్థలు నాశనం చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. గుజరాత్ (Gujarath) అల్లర్ల గురించి ప్రపంచానికి తెలుసునని, సుప్రీం కోర్టు (Supreme court) ఆ కేసు కొట్టివేస్తూ న్యాయమూర్తి పరిధి దాటి వ్యాఖ్యలు చేశారన్నారు. న్యాయమూర్తి వ్యాఖ్యలు ఆధారం చేసుకుని అమిత్ షా పీటీషనర్‌ని అరెస్టు చేయమని చెప్పడం దారుణమన్నారు. పీటీషనర్‌పై అలాంటి వ్యాఖ్యలు చేయడం పౌర హక్కులను కాలరాయడమేనన్నారు. అక్కడ అలా చేస్తూ ఇక్కడికి వచ్చి గిరిజనులపై ప్రేమ ఒలకబోయడం ఖచ్చితంగా రాజకీయ లబ్ది కోసమేనని నారాయణ విమర్శించారు. 


మహారాష్ట్ర సహా 9 రాష్ట్రాల్లో బీజేపీ (BJP) ఓడిపోయినా ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతీస్తూ ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని నారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఫెడరల్ వ్యవస్థను మోదీ దెబ్బ తీస్తున్నారని, ఇప్పుడు బీజేపీ కన్ను ఢిల్లీ, తెలంగాణపై పడిందన్నారు. బీజేపీ, వైసీపీ బంధం చాలా అన్యోన్యంగా, తల వంచి, మెడ వంచి జపం చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీఎం జగన్, ప్రధాని మోదీకి భయపడి, గజగజ వణికి రాష్ట్ర ప్రజల గౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇప్పటి వరకు మోదీ 24 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని, ఇంకో 100 సంస్థలను అమ్మడానికి సిద్ధమయ్యారన్నారు. గుజరాత్ వాళ్ళకే అన్ని అమ్ముతున్నారని, డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు గుజరాత్ వాళ్లేనన్నారు. కేసీఆర్ ఎదురు తిరిగినా, జగన్ మాత్రం ఏమి మాట్లాడరని మండిపడ్డారు. తీర ప్రాంతం అంతా గుజరాత్ వాళ్ళకే రాసిస్తున్నారని, బొగ్గు కొనుగోలుపై కేసీఆర్ ఎదురు తిరిగారని, ఆదాని దగ్గర కొననని చెప్పారన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్ని కలిసి పోరాడాలని పిలుపిచ్చారు. జులై 13 నుంచి 17 వరకు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తామని నారాయణ తెలిపారు.

Updated Date - 2022-07-06T17:30:36+05:30 IST