నరసరావుపేటకు.. సబ్ కలెక్టర్
ABN , First Publish Date - 2020-08-08T08:13:19+05:30 IST
నరసరావుపేట రెవెన్యూ డివిజన్ హోదాను ప్రభుత్వం పెంచింది. సబ్ కలెక్టర్ హోదాకు అప్గ్రేడ్ చేశారు.
ఆర్డీవో స్థాయి నుంచి పెరిగిన హోదా
డివిజన్ రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు బదిలీ
నరసరావుపేట, ఆగస్టు 7: నరసరావుపేట రెవెన్యూ డివిజన్ హోదాను ప్రభుత్వం పెంచింది. సబ్ కలెక్టర్ హోదాకు అప్గ్రేడ్ చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో తెనాలికి మాత్రమే సబ్ కలెక్టర్ హోదా ఉండేది. తెనాలి సరసన నరసరావుపేట డివిజన్ చేరింది. నరసరావుపేట సబ్ కలెక్టర్గా 2018 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీవాస్నూపూర్ అజయ్కుమార్ను ప్రభుత్వం శుక్రవారం నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. 1947లో నరసరావుపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. ఇప్పటి వరకు 52 మంది ఆర్డీవోలు ఇక్కడ విధులు నిర్వహించారు. ఇక్కడ తొలి సబ్ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి నియమితులయ్యారు. ఇక నుంచి పరిపాలనా పరమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి.
ఇక్కడ పనిచేస్తున్న ఆర్డీవో ఎం వెంకటేశ్వర్లును బదిలీ చేశారు. ఆయనకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. ఎటువంటి ముందస్తు లీకులు లేకుండా ఆర్డీవో ఎం వెంకటేశ్వర్లును బదిలీ చేయడం డివిజన్లోని కొందరు రెవెన్యూ అధికారులను కంగు తినిపించింది. ఇక రాజకీయ పార్టీల నేతలు గంటల గంటలు ఆర్డీవో చాంబర్లో కుర్చొనే పరిస్థితులు ఉండవు. ఆర్డీవో బదిలీని కొందరు నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.