రైతు లేని రాజ్యం చేస్తున్నారు : లోకేష్‌

ABN , First Publish Date - 2020-10-20T07:05:32+05:30 IST

కాకినాడ/గొల్లప్రోలు, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రైతు రాజ్యం నినాదంతో రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన సీఎం జగనరెడ్డి ఇప్పుడు రైతు లేని రాజ్యం దిశగా పాలన చేస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు

రైతు లేని రాజ్యం చేస్తున్నారు : లోకేష్‌

కాకినాడ/గొల్లప్రోలు, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రైతు రాజ్యం నినాదంతో రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన సీఎం జగనరెడ్డి ఇప్పుడు రైతు లేని రాజ్యం దిశగా పాలన చేస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలమై, రైతులు పంట నష్టం పోవడం, లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపు నీటిలో చిక్కుకుపోవడంతో వారిని పరామర్శించడానికి ఆయన సోమవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు తమ హయంలో రూ.130 కోట్లు మంజూరు చేస్తే, రీటెండరింగ్‌ పేరుతో ఈ పనులను రద్దు చేసిన ఘనుడు సీఎం జగనరెడ్డి అని అన్నారు. ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పుడు చిన్న పాటి వర్షాలకు గొల్లప్రోలు, పరిసర ప్రాంతాలు నీట మునుగుతున్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు 75 శాతం పూర్తయ్యిందని, తర్వాత ఈ ప్రభుత్వంలో పురోగతి శూన్యమని ఆరోపించారు. వరదలు సంభవిస్తున్నాయనే ముం దస్తు సమాచారం ఉన్నపుడు తగిన జాగ్రత్తలు తీసుకుని పంట మునగకుండా చర్యలు తీసుకో కపోగా రైతును అడుగడుగునా ఈ ప్రభుత్వం, మంత్రులు అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ రాష్ర్టాన్ని ఉద్దరిస్తోందని గొప్పలు చెబుతున్న అధికార పార్టీ నాయకులకు వాస్తవాలు తెలియడం లేదా అని ప్రశ్నించారు. వలంటీర్లు సక్రమంగా పనిచేస్తే గ్రామాల్లో ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఈ సమావేశంలో పార్టీ కాకినాడ పార్లమెంట్‌ నియోజక వర్గ ఇనచార్జ్‌ జ్యోతుల నవీన, మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌వీఎస్‌ఎన వర్మ, వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, కాకినాడ నగర్‌ మేయర్‌ సుంకర పావని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-20T07:05:32+05:30 IST