సీఎం వైఎస్ జగన్‌కు నారా లోకేష్ లేఖ

ABN , First Publish Date - 2020-05-30T00:55:18+05:30 IST

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు.

సీఎం వైఎస్ జగన్‌కు నారా లోకేష్ లేఖ

అమరావతి : తెలుగు రాష్ట్రాలకు మిడతల ముప్పు ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రైతన్నలు భయపడుతున్నారు. ఈ తరుణంలో తగు నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. మిడతల దండు ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలపై దాడి చేసింది. మహారాష్ట్ర నుంచి ఆ దండు తెలుగు రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనంతపురంలోని రాయదుర్గంలో మిడతలు ప్రవేశించాయనే వార్తలు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా నివారణను తేలిగ్గా తీసుకోవడంతో ఇప్పటికే చాలా నష్టం వాటిల్లింది. పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ వ్యాఖ్యలు రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బతీసాయి. మిడతల దండు ప్రభావం భయంకరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే  డ్రోన్లతో పురుగుమందు పిచికారీ సూచించటంతో పాటు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిందిఅని లేఖలో లోకేష్ నిశితంగా వివరించారు. 


 రైతులకు ముందస్తు సూచనలివ్వాలి..

కేంద్ర హెచ్చరికలు, పొరుగు రాష్ట్రాల విధానాలు  పట్టించుకోకుండా ఏడాది వేడుకలు, పబ్లిసిటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ముంచుకొచ్చే ప్రమాదం నివారణకు రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధత ఏమిటి?. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. వ్యవసాయ రంగాన్ని అప్రమత్తం చేసి రైతులకు ముందస్తు సూచనలు ఇవ్వాలి. పరిస్థితిని అధ్యయనం చేయటానికి జిల్లా యంత్రాగాన్ని సిద్ధం చేయాలి. మిడతల ప్రభావిత రాష్ట్రాలు, దేశాలతో సమన్వయం చేసుకోవాలి. సాంకేతికతను వినియోగించుకుంటూ పరిష్కారాలు చేపట్టాలి అని నారా లోకేష్ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2020-05-30T00:55:18+05:30 IST