దొంగ పేపర్ కోసం ప్రజల సొమ్ము మింగుతారా? : లోకేష్ ఫైర్
ABN , First Publish Date - 2020-10-18T23:41:10+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనల పేరిట భారీస్థాయిలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని, వాటి జారీలో పక్షపాత ధోరణి చూపుతోందని
అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనల పేరిట భారీస్థాయిలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని, వాటి జారీలో పక్షపాత ధోరణి చూపుతోందని ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైన విషయం విదితమే. ఇలా ప్రభుత్వ ప్రకటనల్లో సింహభాగం జగతి పబ్లికేషన్ నడుపుతున్న సాక్షి దినపత్రిక, ఇందిరా టెలివిజన్కి చెందిన సాక్షి టీవీకి మాత్రమే ఇస్తుండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ విషయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మాట్లాడారు. దొంగ పేపర్ కోసం ప్రజల సొమ్ము మింగుతారా? అంటూ ఆయన ఫైర్ అయ్యారు.
ప్రజలు ఛీ కొడుతుంటే..
‘అన్న క్యాంటీన్లు ప్రభుత్వానికి అదనపు భారం అంటూ జగన్ పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కున్నారు. ఒక పక్క ప్రకటనల పేరుతో వందల కోట్ల దోపిడీ. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో అవినీతి కరపత్రిక పేరుతో ఐదున్నర కోట్లు కొట్టేస్తున్నారు. ప్రజలు ఛీ కొడుతుంటే అడ్డదారుల్లో సర్క్యూలేషన్ పెంచడానికి నానా తంటాలు పడుతున్నారు. ఎంత పెంచినా దొంగ పత్రిక జన్మ రహస్యమైన అవినీతి కంపు పోతుందా!’ అంటూ నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.