ఆ ట్రాఫిక్ కానిస్టేబుళ్ల మానవత్వానికి నారా లోకేష్, డీజీపీ సవాంగ్ ఫిదా
ABN , First Publish Date - 2022-01-22T16:29:49+05:30 IST
పోలీసులకు విమర్శలతో పాటు ప్రశంసలు సైతం ఎక్కువే. సందర్భానుసారంగా కొన్ని సార్లు.. కర్కశులుగా మరికొన్ని సార్లు మదర్ థెరిసా వారసుల్లా హైలైట్ అవుతుంటారు.
విజయనగరం : పోలీసులకు విమర్శలతో పాటు ప్రశంసలు సైతం ఎక్కువే. సందర్భానుసారంగా కొన్ని సార్లు.. కర్కశులుగా మరికొన్ని సార్లు మదర్ థెరిసా వారసుల్లా హైలైట్ అవుతుంటారు. తాజాగా మదర్ థెరిస్సా వారసుల్లా ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు విజయనగరంలో హైలైట్ అయ్యారు. ఓ వృద్ధుడి పట్ల వీరిద్దరూ చూపిన మానవత్వానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు విషయంలోకి వెళితే.. విజయనగరం పట్టణంలోని గంట స్తంభం జంక్షన్లో ట్రాఫిక్ విధుల్లో ఉన్న వై. సురేష్ కుమార్, ఆర్. సత్యన్నారాయణలకు సొమ్మసిల్లి, అపస్మారక స్థితిలో ఉన్న ఒక వృద్ధుడు కనిపించాడు. వెంటనే దగ్గరలోని మెడికల్ షాపు నుంచి ఓఆర్ఎస్ డ్రింక్ తీసుకొచ్చి అతని చేత తాగించి సపర్యలు చేసి.. కాస్త కోలుకున్న వెంటనే 108లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక వారిరువురినీ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లు మానవత్వం చూపిన విధానంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్లు ఫిదా అయ్యారు. సత్యనారాయణ, సురేష్ కుమార్లపై ప్రశంసల జల్లు కురిపించారు.