Nara Chandrababu తీరు మారింది.. TDP శ్రేణుల్లో ఉత్తేజం..!

ABN , First Publish Date - 2021-10-03T12:41:58+05:30 IST

Nara Chandrababu తీరు మారింది.. TDP శ్రేణుల్లో ఉత్తేజం..

Nara Chandrababu తీరు మారింది.. TDP శ్రేణుల్లో ఉత్తేజం..!

తిరుపతి/చిత్తూరు జిల్లా : ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ప్రదర్శిస్తున్న తీరుతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నెలకొంటోంది. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే తనకు దృష్టికి వచ్చిన వెంటనే ఆయన స్పందిస్తున్నారు. ప్రమాదాలకు, అనారోగ్యాలకు గురైనా, మరణించినా, ప్రత్యర్థుల వేధింపులకు, దౌర్జన్యాలకు గురవుతున్నా తెలిసిన తక్షణం అధినేత నుంచీ బాధితులకు, కుటుంబీకులకు ఫోన్‌ కాల్‌ వస్తోంది. ఏం జరిగిందంటూ పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులు చెప్పేది ఓపిగ్గా వింటున్నారు. సాయం ఏమైనా కావాలా అంటూ ప్రశ్నించి మరీ అవసరమైన మేరకు సాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయపరమైన సాయం కావాలంటే పార్టీ తరపునే అందిస్తామని చెబుతున్నారు.


ఏ పరిస్థితికీ భయపడొద్దని, పార్టీ అండగా వుంటుందని ధైర్యం చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న కొందరికి పార్టీ తరపున ఆర్థిక సాయం చేసేందుకు కూడా అధినేత స్వయంగా అడుగుతుండడంతో బాధితులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.ఆరు నెలలుగా అధినేత ఈ ధోరణి కనబరుస్తుండడం, పరామర్శ విషయంలో నాయకులు, సామాన్య కార్యకర్తలనే తేడా చూపకపోవడం శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఒకవేళ చంద్రబాబు ఇతర కార్యక్రమాలతో బిజీగా వుంటే ఆయన బదులు యువనేత నారా లోకేష్‌ బాధితులకు ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు.పార్టీ అధినేత, యువనేతలు అనుసరిస్తున్న ఈ తీరుతో పార్టీ శ్రేణులు సంబరపడుతున్నారు. దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ కోసం కష్టపడి పనిచేయడానికి, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కొనడానికి శ్రేణులు మానసికంగా సిద్ధపడుతున్నాయి.


దగ్గుబాటికి పరామర్శ..

కలకడకు చెందిన జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి దగ్గుబాటి వెంకటేశ్వరరావును శనివారం పార్టీ అధినేత చంద్రబాబు  పరామర్శించారు. ఇటీవల  వెంకటేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. జిల్లా పార్టీ నేతల ద్వారా సమాచారం తెలుసుకున్న అధినేత శనివారం ఫోన్‌ చేసి యోగక్షేమాలు ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.తిరుపతిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్టు చెప్పగా అవసరమైతే మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తామని  భరోసా ఇచ్చారు. ఆ సమయంలో దగ్గుబాటి పక్కనే వున్న కలకడ మండలానికే చెందిన మరో నేత దేవలపల్లి ప్రభాకర్‌ నాయుడితో సైతం చంద్రబాబు మాట్లాడారు.

Updated Date - 2021-10-03T12:41:58+05:30 IST