హిజ్రాను రహస్యంగా పెళ్లి చేసుకుని.. ఓ ఆర్మీ ఉద్యోగి చివరకు చేసిన నిర్వాకమిది!
ABN , First Publish Date - 2020-07-12T17:49:15+05:30 IST
ఓ హిజ్రాను ఆర్మీ ఉద్యోగి రహస్యంగా పెళ్లి చేసుకుని..
నమ్మించి ద్రోహం
హిజ్రాకు ఆర్మీ ఉద్యోగికి వంచన
పెళ్లి చేసుకుని.. సొమ్ము కాజేసి..
నంద్యాల(కర్నూలు): ఓ హిజ్రాను ఆర్మీ ఉద్యోగి రహస్యంగా పెళ్లి చేసుకుని మోసగించాడు. ఐదు సంవత్సరాలు కాపురం చేసి రూ.30 లక్షలు, 12 తులాల బంగారం, 6 కేజీల వెండి కాజేసి ఉడాయించాడు. హిజ్రాకు తెలియకుండా మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన నంద్యాల మండలం అబాండం తండాలో చోటు చేసుకుంది. మోసపోయిన హిజ్రా తాలుకా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అబాండం తండాకు చెందిన ఓ హిజ్రాకు గూడ్షెడ్ ఏరియాకు చెందిన ఆర్మీ ఉద్యోగి షేక్ మాలిక్ బాషాతో పరిచయం ఏర్పడింది. స్వప్న దగ్గర భారీగా డబ్బు, ఆస్తులు ఉండటంతో చనువుగా ఉండేవాడు.
ఈ క్రమంలో ఆమెకు జీవితాంతం తోడు ఉంటానని చెప్పి రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఐదు సంవత్సరాలు కాపురం చేశాడు. స్వప్న దగ్గర ఉన్న రూ.30 లక్షల నగదు, 12 తులాల బంగారం, 6 కేజీల వెండి కాజేశాడు. అద్దె ఇంటిలో ఉంటున్న మాలిక్ బాషా కోసం స్వప్న తన డబ్బుతో ఓ ఇల్లు కట్టించి ఇచ్చింది. కానీ ఆమెకు తెలియకుండా బాషా ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. తాను డ్యాన్స్లు చేసి సంపాదించిన నగదు, బంగారం కాజేసి మోసగించాడని గుర్తించిన హిజ్రా నంద్యాల తాలుకా ఎస్ఐ సుధాకర్రెడ్డికి శనివారం ఫిర్యాదు చేసింది. మాలిక్ బాషాతో పాటు అతని కుటుంబ సభ్యులు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.