మాతా శిశు మరణాలు లేకుండా చూడాలి
ABN , First Publish Date - 2022-05-24T06:16:58+05:30 IST
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాతా శిశు మరణాలు లేకుండా చూడాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ జగదీష్చంద్రారెడ్డి ఆదేశించారు.
నంద్యాల (నూనెపల్లె), మే 23: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాతా శిశు మరణాలు లేకుండా చూడాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ జగదీష్చంద్రారెడ్డి ఆదేశించారు. నంద్యాల మండలంలోని చాపిరేవుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. డాక్టర్ జగదీష్చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాన్పుల సంఖ్య పెంచాలని, మాతా శిశు మరణాలను నివారించాలని సిబ్బందికి సూచించారు. గర్భిణులకు రక్తహీనత లేకుండా చూడాలని, ప్రమాదం అంచుల్లో ఉన్న గర్భిణులను గుర్తించి సరైన చికిత్సను అందించాలని సూచించారు. అంగన్వాడీ సెంటర్లలో గర్భిణులకు పౌస్టికాహారం అందించేలా చర్యలు చేపట్టి, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతినెల 9వ తేదీ జరిగే ప్రధానమంత్రి మాతృ వందన కార్యక్రమంలో వైద్యులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని పరీక్షలు చేసి వైద్యం అందించాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో చాపిరేవుల పీహెచ్సీ వైద్యులు డాక్టర్ కిశోర్కుమార్రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న, సుబ్బలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.