నందమూరి క్రికెట్ ట్రోఫీ విజేత ‘రావూరు’
ABN , First Publish Date - 2022-01-27T05:22:13+05:30 IST
నందమూరి బసవరామ తారకం మెమోరియల్ 35వ జిల్లాస్థాయి క్రికెట్ ట్రోఫీని రావూరు జట్టు గెలుచుకుంది.
ఇందుకూరుపేట, జనవరి 26 : నందమూరి బసవరామ తారకం మెమోరియల్ 35వ జిల్లాస్థాయి క్రికెట్ ట్రోఫీని రావూరు జట్టు గెలుచుకుంది. బుధవారం పల్లెపాడు ప్రభుత్వ హైస్కూల్లో జరిగిన ఫైనల్స్లో పల్లెపాడు - రావూరు జట్లు తలపడ్డాయి. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన పోటీలో రావూరు జట్టు విజయాన్ని కైవసం చేసుకుంది. 35ఏళ్లగా జానా గిరిబాబు ఆధ్వర్యంలో నందమూరి బసవరామ తారకం మెమోరియల్ కమిటీ నందమూరి కుటుంబ సభ్యుల ఆశీస్సులతో నిర్వహిస్తోంది. జనవరి 9న ప్రారంభమైన ఈ జిల్లాస్థాయి పోటీల్లో 32 టీములు, 450మంది క్రీడాకారులు పాల్గొనగా, 18 రోజులు ఏకధాటిగా నిర్వహించారు. పోటీలో గెలుపొందిన విన్నర్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ.40వేలు నగదు బహుమతి, అలాగే పల్లెపాడు రన్నర్ జట్టుకు రూ.20వేలు నగదు బహుమతిని అందజేశారు. అనంతరం బహుమతి కార్యక్రమంలో ముఖ్యఅతిఽథిగా పాల్గొన్న చెంచలబాబుయాదవ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ కుటుంబ ఆశీస్సులు పొందడం, అధికారంలో ఉన్నా.. లేకున్నా సొంత నిధులతో ఈ పోటీలు రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించిందన్నారు. నిర్వాహకుడు జానా గిరిబాబు మాట్లాడుతూ 35ఏళ్లగా పోటీలు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వ్యక్తిగత ప్రతిభ కనపరచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.