కోడెల సేవలు చిరస్మరణీయం: బాలకృష్ణ
ABN , First Publish Date - 2020-09-17T08:33:17+05:30 IST
కోడెల సేవలు చిరస్మరణీయం: బాలకృష్ణ
హైదరాబాద్/బంజారాహిల్స్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేదలకి, వైద్యరంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రముఖ సినీ హీరో, ఎమ్మెల్యే, బసవతారకం ఇండో- అమెరికన్ కేన్సర్ అస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ కొనియాడారు. క్యాన్సర్ ఆస్పత్రి స్థాపనలో కూడా ఆయన పాత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. కోడెల మొదటి వర్ధంతి సందర్భంగా బసవతారకం ఆస్పత్రిలో బుధవారం సంస్మరణ సభ నిర్వహించారు. కోడెల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటినుంచి కోడెల నిబద్దత గల కార్యకర్తగా పనిచేశారని బాలకృష్ణ అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారన్నారు. ఆస్పత్రి సీఈఓ ప్రభాకరరావు, మెడికల్ డైరెక్టర్ టీఎస్ రావు, సీఓఓ రవికుమార్, మెడికల్ సూపరింటెండెంట్ ఫణి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్భవన్లో టీడీపీ నేతల నివాళి
కోడెల వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్భవన్లో టీడీపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ కోడెల వైద్యుడిగా, నాయకుడిగా ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారని టీడీపీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బక్కని నర్సింలు కొనియాడారు. దుర్గాప్రసాద్ తదితరులు నివాళులర్పించారు.