ఒకే రాత్రి.. నాలుగిళ్లలో చోరీ!
ABN , First Publish Date - 2022-05-22T05:41:32+05:30 IST
పట్టణంలో శుక్రవారం రాత్రి నాలుగిళ్లలో దొంగలు పడ్డారు.
మైదుకూరు, మే 21: పట్టణంలో శుక్రవారం రాత్రి నాలుగిళ్లలో దొంగలు పడ్డారు. స్థానిక బాలాజీనగర్లో నివాసముంటున్న చొక్కం నరసింహులు తన పక్కింట్లో ఉన్న తమ్ముడి కుమారులు చొక్కం నరసింహులు, రామచంద్ర కుటంబ సభ్యులతో కలసి శుక్రవారం ఇంటికి తాళం వేసి పెంచల నరసింహస్వామి దర్శనానికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి ప్రవేశించారు. మూడు ఇళ్లలో కలిపి 8.5 తులాల బంగారు నగలు, దాదాపు 10 వేలు నగదు చోరీ చేశారు. స్థానిక ఎల్లమ్మ గుడి సమీపంలో నివాసముంటున్న భూమిరెడ్డి మేరమ్మ రెండు రోజుల క్రి తం ప్రొద్దుటూరులోని తన కుమార్తె ఇం టికి వెళ్లగా ఆమె ఇంట్లో రూ. 1,30 లక్షల నగదుతో పాటు 1 తులం బంగారు చైను చోరీ చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. కాగా చోరీకి గురైన ఇళ్లను స్థానిక పోలీసులతో పాటు, క్లూస్టీం సిబ్బంది పరిశీలించారు.
ఇంటికి తాళం వేస్తే సమాచారం ఇవ్వండి: సీఐ
వివాహాలు, ఇతర కార్యక్రమాలకు వెళ్లే వారు తమకు సమాచారం ఇవ్వాలని అర్భన్ సీఐ చలపతి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎల్ హెచ్ఎంఎస్ యాప్ను తమ సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని అయినా, లేదా స్వయంగా కలిసి అయినా తమకు వివరాలు ఇస్తే తాము సీసీ కెమారాలో ఏర్పాటు చేయడంతో పాటు భద్రత కల్పిస్తామని సీఐ వివరించారు.