Woman Scientist : సీఎస్ఐఆర్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నల్లతంబి కలైసెల్వి రికార్డు

ABN , First Publish Date - 2022-08-07T19:34:40+05:30 IST

శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (CSIR) డైరెక్టర్ జనరల్‌గా

Woman Scientist : సీఎస్ఐఆర్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నల్లతంబి కలైసెల్వి రికార్డు

న్యూఢిల్లీ : శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (CSIR) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ సైంటిస్ట్ నల్లతంబి కలైసెల్వి (Nallathamby Kalaiselvi) నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఏప్రిల్‌లో పదవీ విరమణ చేసిన శేఖర్ మండే స్థానంలో ఆమె నియమితులయ్యారు. సీఎస్ఐఆర్ మన దేశంలోని 38 పరిశోధన సంస్థల కన్సార్షియం.


 శేఖర్ మండే పదవీ విరమణ చేసిన తర్వాత బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి రాజేశ్ గోఖలేకు సీఎస్ఐఆర్ అదనపు బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. తాజాగా సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన నల్లతంబి కలైసెల్వి తమిళనాడులోని కరైకుడిలో ఉన్న సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆమె సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. 


కలైసెల్వి సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ పదవీ కాలం రెండేళ్ళు. ఆమె ఈ పదవీ బాధ్యతలను చేపట్టిన తేదీ నుంచి రెండేళ్ళు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు, ఈ రెండిటిలో ఏది ముందు అయితే ఆ తేదీ వరకు ఆమె ఈ పదవిని నిర్వహించవచ్చు. సీఎస్ఐఆర్‌లో ఎంట్రీ లెవెల్ సైంటిస్ట్‌గా ఆమె కెరీర్ ప్రారంభమైంది. 


నల్లతంబి కలైసెల్వి తమిళనాడు (Tamil Nadu)లోని తిరునల్వేలి జిల్లా, అంబసముద్రంలో జన్మించారు. ఆమె తమిళ మాధ్యమం (Tamil Medium)లో చదివారు. తాను తమిళంలో చదవడం వల్ల కళాశాలలో సైన్స్ భావనలను అర్థం చేసుకోగలిగానని చెప్తూ ఉంటారు. ఆమె 125 పరిశోధన పత్రాలను సమర్పించారు. ఆరు పేటెంట్లను పొందారు. లిథియం అయాన్ బ్యాటరీస్ రంగంలో విశేష కృషి చేశారు. 



 

Updated Date - 2022-08-07T19:34:40+05:30 IST