Jagan Reddy స్వంత బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు: Nakka Anandababu
ABN , First Publish Date - 2022-07-17T15:42:05+05:30 IST
ఏపి (AP)లో మద్యం మరణాలు సర్వ సాధారణం అయ్యాయని నక్కా ఆనందబాబు విమర్శించారు.
గుంటూరు (Guntur): ఏపి (AP)లో మద్యం మరణాలు సర్వ సాధారణం అయ్యాయని, సీఎం జగన్ రెడ్డి (CM Jagan) స్వంత బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు (Nakka Anandababu) విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) కంపెనీలలో తయారైన మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతోందని ఆరోపించారు. మొన్న జంగారెడ్డిగూడెం, నిన్న చిలకలూరిపేట, నేడు రేపల్లెలలో మద్యం తాగి మరణించారని, ప్రభుత్వ వైన్ షాపులలో కొనుగోలు చేసిన మద్యం తాగి బాధితులు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాబ్ రిపోర్టులు రాకుండానే మద్యం మరణాలు కాదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. బాధిత కుటుంబాల పరామర్శలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం తమ ప్రాధమిక హక్కులను హరిస్తోందని మండిపడ్డారు. ఎంత కాలం అడ్డుకుంటారో చూస్తామన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాటం చేస్తుందని ఆనందబాబు స్పష్టం చేశారు.
మరోవైపు బాపట్ల జిల్లా, రేపల్లెలోని టీడీపీ కార్యాలయం ముందు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బైఠాయించి నిరసన చేపట్టారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై కూర్చుని నిరసన తెలుపుతున్నారు. ఎమ్మెల్యేకు మద్దతుగా టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.