కేళీ విత్తనాలతో నష్టపోయాం
ABN , First Publish Date - 2021-09-17T06:41:18+05:30 IST
సగానికి సగం కేళీ విత్తనాలతో నష్టపోయామంటూ అన్నదాతలు గురువారం రెడ్డిగూడెంలో రహదారిపై ధర్నా దిగారు.
రెడ్డిగూడెంలో రహదారిపై రైతుల ధర్నా
రెడ్డిగూడెం : సగానికి సగం కేళీ విత్తనాలతో నష్టపోయామంటూ అన్నదాతలు గురువారం రెడ్డిగూడెంలో రహదారిపై ధర్నా దిగారు. రెడ్డిగూడెం ప్రసాద్ మేన్యూర్స్ అండ్ ఫెస్టిసైడ్స్ సీడ్ దుకాణం నుంచి రెడ్డిగూడెం, రాఘవాపురం, రంగాపురం రైతులు 1061 రకం (అన్నదాత సీడ్స్) వరి విత్తనాలను కొనుగోలు చేసి ఖరీఫ్లో సాగు చేశారు. సగానికి సంగం కేళీలు తేలడంతో గత 16 రోజుల నుంచి విత్తనాలు అమ్మిన దుకాణందారుడి వద్దకు తిరుగుతున్నామన్నారు. ఇదిగో అదిగో.. వస్తానని కాలం వెళ్లదీస్తున్నాడే తప్ప పొలాలకు వచ్చి పరిశీలించలేదన్నారు. అందరం వచ్చి యజమానిని అడిగినా సరైన సమాధానం చెప్పకపోవడంతో ధర్నాకు దిగామని రైతులు అన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు అక్కడికి చేరుకొని షాపు యజమానితో, రైతులతో చర్చలు జరిపారు. రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఏవో జోగేంద్రప్రసాద్ మాట్లా డుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు తెలుపుతామన్నారు.