కోర్టులో బలంగా వాదించమని చెప్పండి!
ABN , First Publish Date - 2020-10-18T10:17:05+05:30 IST
‘‘నేను ఎలాంటి తప్పూ చేయలేదు. అన్నీ నిబంధనల ప్రకారమే చేశా.
నా తప్పేమీ లేదు.. నిబంధనల ప్రకారమే చేశా
కుటుంబీకులతో మాజీ తహసీల్దార్ నాగరాజు
బయటికొచ్చిన 73 సెకన్ల ములాఖత్ వీడియో
నా భర్తది ఆత్మహత్య కాదు: నాగరాజు భార్య స్వప్న
హైదరాబాద్/అల్వాల్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను ఎలాంటి తప్పూ చేయలేదు. అన్నీ నిబంధనల ప్రకారమే చేశా. ఈ విషయాలన్నీ న్యాయవాదికి చెప్పి కోర్టులో బలంగా వాదనలు వినిపించాలని చెప్పండి’’.. ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆన్లైన్ ములాఖత్ సందర్భంగా కుటుంబ సభ్యులతో చెప్పిన మాటలివి. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత అన్ని విషయాల్ని కోర్టులో చూసుకుందామని కుటుంబ సభ్యులు సైతం ఆయనకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు నాగరాజుతో కుటుంబ సభ్యుల సంభాషణకు సంబంధించి 73 సెకన్ల నిడివిగల వీడియో ఒకటి బయటకు వచ్చింది. భూ వివాదంలో రూ.1.10కోట్లు లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్ నాగరాజు ఆగస్టు 14న ఏసీబీకి పట్టుబడగా.. కేసు నమోదైన విషయం తెలిసిందే.
పాసుపుస్తకాల జారీ వెనుక అధికార దుర్వినియోగం జరిగిందన్న అభియోగాలపై ఏసీబీ అధికారులు ఆయనపై రెండో కేసును సైతం నమోదు చేశారు. రెండో కేసులో ఏసీబీ కస్టడీకి తీసుకోవడానికి ముందు రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల్లో ఉన్న ఆయన.. ఆన్లైన్ ద్వారా కుటుంబసభ్యులతో ములాఖత్ అయ్యారు. తాను ఏ తప్పూ చేయలేదని, నిబంధనల మేరకే పని చేశానని కుటుంబ సభ్యులకు వెల్లడించారు. ఆ తర్వాత రెండో కేసు విషయమై ఏసీబీ కస్టడీలోకి తీసుకోగా.... మొదటి రోజు విచారణ అనంతరం అనూహ్యంగా నాగరాజు జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా, నాగరాజు మృతిపై కస్టోడియల్ డెత్గా కేసు నమోదు చేసిన అధికారులు..ఈ సమాచారాన్ని ఏసీబీ కోర్టుకు అందించారు.
కస్టడీలో నాగరాజు ఏసీబీకి కీలక విషయాలు వెల్లడించారు. ఓ జిల్లా స్థాయి అధికారి సూచన మేరకే తాను ఈ పని చేశానని స్పష్టం చేశారు. తన భర్త ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని నాగరాజు భార్య స్వప్న అన్నారు. ఆయనది ఆత్మహత్య కాదని, మూమ్మాటికి హత్యేనని ఆమె ఆరోపించారు. తన భర్త మరణంలో కుట్ర దాగుందని ఆమె ఆరోపించారు. న్యాయం జరిగే వరకు చట్టపరంగా పోరాడుతానని చెప్పారు. విషయాలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని తెలిపారు. ప్రభుత్వం తనకు న్యాయం చేయలని స్వప్న డిమాండ్ చేశారు.