నాగరాజు హంతకులకు ఉరిశిక్ష వేయాలి

ABN , First Publish Date - 2022-05-15T09:01:33+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వానికి దళితులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి నాగరాజును హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష పడేలా చూడాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కో-ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

నాగరాజు హంతకులకు ఉరిశిక్ష వేయాలి

ఆ కుటుంబానికి  బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్‌ పరామర్శ 

వికారాబాద్‌/మర్పల్లి, మే 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వానికి దళితులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి నాగరాజును హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష పడేలా చూడాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కో-ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో పరువు హత్యకు గురైన నాగరాజు భార్య అశ్రీన్‌ సుల్తానా,  తల్లిదండ్రులను ఆయన శనివారం సాయంత్రం మర్పల్లిలో పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాగరాజు హత్య ఘటన అమానుషమని, దీనిపై ప్రభుత్వం స్పందించిన తీరు చాలా దారుణమన్నారు.  సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో కూర్చొని ఎన్నో సంఘటనల్లో  ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని,  నాగరాజు ఘటనలో ఎందుకు ఇంతవరకూ ప్రకటించలేదని అడిగారు. కాగా, ఈ సంఘటనకు మతం రంగు పులమడానికి, మతాల మధ్య జరిగిన నేరంగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అశ్రీన్‌ సుల్తానాకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద వచ్చే నష్టపరిహారంతో పాటు దళితబంధు పథకం కింద రూ.10 లక్షలు అందజేయాలన్నారు. న్యాయం జరిగేవరకూ బాధితురాలికి బీఎస్పీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.  

Updated Date - 2022-05-15T09:01:33+05:30 IST