నాడు-నేడుపై దృష్టి పెట్టండి

ABN , First Publish Date - 2022-05-22T06:42:14+05:30 IST

పాఠశాలల అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న మనబడి, నాడు - నేడు పనులను వేసవి సెలవుల్లో చేపట్టి, పాఠశాలలు తెరిచే నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

నాడు-నేడుపై దృష్టి పెట్టండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, పక్కన పీవో గోపాలక్రిష్ణ, డీఈవో రమేశ్‌

పాఠశాలలు తెరిచే నాటికి పనులు పూర్తిచేయాలి

పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు

జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌  

పాడేరు, మే 21 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న మనబడి, నాడు - నేడు పనులను వేసవి సెలవుల్లో చేపట్టి, పాఠశాలలు తెరిచే నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో శనివారం మనబడి నాడు- నేడు పనులపై విద్యాశాఖాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా మాత్రమే పనులు చేపట్టాలన్నారు. పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశంలో తీర్మానం ప్రకారమే పనులు చేపట్టాలని, తీర్మాన పత్రాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. పనులపై సంబంధిత ఇంజనీరుతో ఒప్పందం చేసుకోవాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడే సంపూర్ణ బాధ్యత తీసుకుని, పూర్తి చేయాలన్నారు. పనులు చేపట్టడంలో నిర్లక్ష్యంగా ఎవరు వ్యవహరించినా శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. పనుల్లో ఎటువంటి సమస్యలు తలెత్తినా జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి తీసుకురావాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్‌ ప్రభుత్వమే సరఫరా చేస్తుందని, ఇనుము, ఇతర సామగ్రిని బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాలన్నారు. మేస్ర్తీలు, కూలీలను స్థానికంగానే గుర్తించాలన్నారు. పనులు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. మొదటిదశ నాడు-నేడు పనుల్లో లోటుపాట్లను అధిగమించాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పనులు జరగాలని, ఎక్కడైనా కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. విద్య, ఇంజనీరింగ్‌ శాఖల సమన్వయంతో నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసేందుకు కృషిచేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ పి.రమేశ్‌, ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ బి.శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ విద్యాశాఖ డీడీ పీఏ మణికుమార్‌, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈలు డీవీఆర్‌ఎం రాజు, వేణుగోపాల్‌, డీఈఈలు, ఏఈఈలు, ఎంఈవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. 



 


  

Updated Date - 2022-05-22T06:42:14+05:30 IST