జనసేన పార్టీకి ఆదరణ పెరిగింది
ABN , First Publish Date - 2021-11-29T06:05:45+05:30 IST
జనసేన పార్టీ బలం పెరిగిందని, ప్రజల్లో ఆదరణ, నమ్మకం పెరిగాయని, స్థానిక ఎన్నికల్లోనే ఇది రుజువైందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రుజువైంది
కార్యకర్తలు మరింత కష్టపడాలి
జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్
జగ్గంపేట, నవంబరు 28: జనసేన పార్టీ బలం పెరిగిందని, ప్రజల్లో ఆదరణ, నమ్మకం పెరిగాయని, స్థానిక ఎన్నికల్లోనే ఇది రుజువైందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక ఎన్నికల్లో జనసేనాని పవన్కల్యాణ్ పిలుపు మేరకు ఎంతోమంది యువత, మహిళలు పోటీకి ముందుకు వచ్చారన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తగ్గకుండా పోటీలో నిలబడ్డారని వారిని అభినందించారు. జగ్గంపేటలో నియోజకవర్గ జనసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన నాదెండ్ల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసి ఏదో చేశామని చెప్పుకొని మళ్లీ ఓట్ల కోసం ప్రజల ముందుకు వెళ్లాలనుకుంటోందని, కనీస అభివృద్ధి కూడా చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఐదుసార్లు ఇసుక పాలసీ తీసుకువచ్చారని, కానీ ఇప్పటికీ సామాన్యులకు ఇసుక అందుబాటులో లేదని విమర్శించారు. క్రియాశీలక సభ్యులు పార్టీకోసం సమయం కేటాయించాలని, వారానికి రెండు గంటల సమయం కేటాయిస్తే ఎంతోమందిని ప్రభావితం చేయగలుగుతామని అభిప్రాయపడ్డారు. జనసేనాని పవన్కల్యాణ్ ముఖ్యమంత్రి అయితే జరిగే మంచిని క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయాలన్నారు. ఏ కార్యక్రమం చేసినా పార్టీ పిలుపు మేరకు కలిసి కట్టుగా చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే రాజకీయంగా ఎదగగలుగుతామని, నాలుగు ఫ్లెక్సీలు కట్టి సోషల్ మీడియాని వాడుకొని పెద్ద నాయకులైపోదామనుకుంటే పొరపాటని హితవు పలికారు. ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. జగ్గంపేట ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, పాఠంశెట్టి శ్రీదేవి, నియోజకవర్గ ఇన్చార్జ్లు వరుపుల తమ్మయ్యబాబు, బండారు శ్రీనివాస్, మేడ గురుదత్తప్రసాద్, పోలిశెట్టి చంద్రశేఖర్, మారేటి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప, జిల్లా ప్రధాన కార్యదర్శి బోడపాటి రాజేశ్వరి పాల్గొన్నారు.
ఏడీబీ రోడ్డులోజనసేన నేతల శ్రమదానం
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్తీక వనసమారాధన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముందు ఏడీబీరోడ్డు-అచ్చంపేట జంక్షన్ వద్ద దెబ్బతిన్న రోడ్లకి శ్రమదానం ద్వారా మరమ్మతులు చేపట్టారు. పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణతోపాటు పలువురు పాల్గొన్నారు. వనసమారాధనలో మొక్కలు నాటారు.